అద్వానీని కలిసిన టీడీపీ ఎంపీలు: 'బీజేపీని నమ్మట్లేదు, అంత ఖర్మ పట్టలేదు, కవితకు థ్యాంక్స్'
Recommended Video
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ఎంపీలు శుక్రవారం పార్లమెంటులో బీజేపీ అగ్రనేత అద్వానీని కలిశారు. ఏపీ విభజన సమస్యలను ఆయనకు వివరించారు. విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చేలా చూడాలన్నారు. ఏపీకి కేంద్రం న్యాయం చేయాలన్నారు.
ఏపీకి హామీపై గడ్కరీ, వెంకయ్యపై నిప్పులు చెరిగిన విజయసాయి రెడ్డి
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో మాట్లాడుతానని టీడీపీ ఎంపీలకు అద్వానీ హామీ ఇచ్చారు. ఏపీకి కేంద్రం న్యాయం చేయాల్సి ఉందన్నారు. మరోవైపు, అంతకుముందు, బీజేపీపై ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎంపీలు మురళీ మోహన్, గల్లా జయదేవ్, అవంతి శ్రీనివాస్ తదితరులు శుక్రవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లోకసభ వాయిదాపడిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
టీడీపీని నమ్మే పరిస్థితి లేదు
బీజేపీని ప్రస్తుతం ఏ మిత్రపక్షం నమ్మే పరిస్థితులు కనిపించడం లేదని టీడీపీ ఎంపీ కల్లా జయదేవ్ మండిపడ్డారు. ఉద్దేశ్యపూర్వకంగానే రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచస్థాయి రాజధానిని ఏపీకి కడతామని ప్రధాని మోడీ చెప్పారని మురళీ మోహన్ గుర్తు చేశారు. తిరుపతిలో, విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా మోడీ ఏం చెప్పారో బీజేపీ గుర్తుంచుకోవాలన్నారు. విభజన హామీలపై మోడీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. టీడీపీ వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం టీడీపీ పెట్టినట్లు చెప్పారు.
పద్మావత్ సినిమాలో హీరోను విలన్ మోసం చేసినట్లు
లోకసభలో అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనపై ఏపీ ఎంపీలందరూ అసంతృప్తిగా ఉన్నారని మరో ఎంపీ అవంతీ శ్రీనివాస్ అన్నారు. అన్ని విషయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామన్నారు. పద్మావత్ సినిమాలో హీరోను విలన్ మోసం చేసినట్టుగా కేంద్రం వ్యవహరిస్తోందని అన్నారు.
ప్రతిసారి చర్చలకు పిలిచి
ప్రతిసారి చర్చలకు పిలిచి, మోసం చేశారని అవంతి మండిపడ్డారు. ఏపీ ప్రజలు ఒక్కసారి సహనం కోల్పోతే ఏం జరుగుతోందో గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. కాంగ్రెస్కు పట్టిన గతే బీజేపీకి పట్టకుండా చూసుకోవాలన్నారు. తమకు హైకమాండ్ ప్రజలే అని చెప్పారు. రైల్వే జోన్ గురించి ఏపీ బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
మాకు ఆ ఖర్మ లేదు
విభజన చట్టంలో ఉన్నవాటినే తాము అడుగుతున్నామని, అంతకు మించి ఏదీ అడగడం లేదని అవంతి అన్నారు. ఎప్పుడు ఢిల్లీకి వచ్చినా చూద్దాం, చేద్దామనే అంటూ సమయం దాటవేస్తున్నారన్నారు. తమకు లిప్ సింపతీ అవసరం లేదని, బీజేపీతో లాలూచీ పడాల్సిన ఖర్మ తమకు లేదన్నారు.
కవితకు థ్యాంక్స్, తెలంగాణ ప్రయోజనాల కోసం పోరు
తమకు మద్దతిచ్చిన టీఆర్ఎస్ ఎంపీ కవితకు ధన్యవాదాలు అన్నారు. తెలుగు ప్రజలంతా రెండు రాష్ట్రాలుగా విడిపోయినా కలిసే ఉంటారన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రయోజనాల కోసం కూడా తాము పోరాటం చేస్తామని అన్నారు.