చట్టంలో ఉందిగా మోడీకి ఇబ్బందేంటి!: టీడీపీ ఎంపీలతో రాష్ట్రపతి, కేశినేనికి మమత ప్రశంస
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ ఎంపీలు బుధవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిశారు. విభజన చట్టం అమలు, కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై రాష్ట్రపతికి వినతిపత్రం అందించారు. అనంతరం ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, టీజీ వెంకటేష్ తదితరులు మీడియాతో మాట్లాడారు.
ఎంపీ సీఎం రమేష్ ఆధ్వర్యంలో ఎంపీలు, కడప జిల్లా టీడీపీ నేతలు రాష్ట్రపతిని కలిశారు. విభజన చట్టం అమలు, కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అంశాన్ని ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. కేంద్ర ప్రభుత్వం తీరుపై ఆయనకు ఫిర్యాదు చేశారు.
త్రిపురలో బీజేపీని గెలిపించిన నేతకు ఏపీలో కీలక బాధ్యతలు: ఎవరీ దియోధర్?
స్టీల్ ప్లాంట్ ఆవశ్యకత తెలిపాం
కడపకు ఉక్కు పరిశ్రమ రావాల్సిన ఆవశ్యకతను రాష్ట్రపతికి తెలియజేశామని గల్లా జయదేవ్ అన్నారు. స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేలా కేంద్రానికి సూచనలు చేయాలని ఆయనను కోరినట్లు చెప్పారు. ఉక్కు ఫ్యాక్టరీకి ఉన్న భూసమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించిందని ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. కానీ ఇప్పుడు సాధ్యాసాధ్యాలు అంటూ కేంద్రం మెలిక పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
చట్టంలో ఉంది కదా.. ఇబ్బంది ఏమిటని రాష్ట్రపతి అడిగారు
విభజన చట్టం అమలు, కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు హామీని కేంద్రం అమలు చేయడం లేదని తాము రాష్ట్రపతికి చెప్పామని సీఎం రమేష్ అన్నారు. చట్టంలో ఉన్నప్పుడు ఇబ్బంది ఏమిటి (మోడీ ప్రభుత్వానికి ఇబ్బంది ఏమిటని) అని ఆయన అడిగారని తెలిపారు. ఉక్కు పరిశ్రమ కోసం తాను దీక్ష చేసిన విషయం తన దృష్టికి వచ్చినట్లు రాష్ట్రపతి చెప్పారన్నారు. సాధ్యాసాధ్యాలపై నివేదిక కూడా వచ్చిందని, ప్రధాని అనుమతి ఇస్తే సరిపోతుందని చెప్పామన్నారు. సంబంధిత శాఖలకు సూచనలు చేస్తామని రాష్ట్రపతి తమకు హామీ ఇచ్చారని తెలిపారు.
అవిశ్వాసం భేష్.. టీడీపీ ఎంపీలకు మమత ప్రశంస
పార్లమెంటు సెంట్రల్ హాలులో టీడీపీ ఎంపీలకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎదురయ్యారు. ఈ సందర్భంగా టీడీపీని ఆమె ప్రశంసించారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టి మంచి పని చేశారన్నారు. గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడుల ప్రసంగాలకు ఆమె కితాబిచ్చారు. కేశినేని నానిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు.
విశాఖ రైల్వే జోన్ అంశం ప్రస్తావన
లోకసభలో జీరో అవర్లో విశాఖపట్నం రైల్వే జోన్ అంశంపై టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ ప్రస్తావించారు. రైల్వే జోన్పై కేంద్రం ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందన్నారు. విశాఖ రైల్వే జోన్ ఇస్తామని పార్లమెంటులో చెప్పి, అసాధ్యమని సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. రైల్వే జోన్పై వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.