స్టీల్ ప్లాంట్: కేంద్రమంత్రితో టీడీపీ ఎంపీలు భేటీ, 'అది జగన్కు ఎలా తెలిసింది'
న్యూఢిల్లీ: కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ను తెలుగుదేశం పార్టీ ఎంపీలు బుధవారం మధ్యాహ్నం కలిశారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బీరేంద్ర సింగ్ మాట్లాడుతూ... స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు.
తెలుగు రాష్ట్రాల నుంచి మరింత స్పష్టత రావాల్సి ఉందని చెప్పారు. ఏపీలో కడప, తెలంగాణలో బయ్యారం స్టీల్ ప్లాంట్ పరిశ్రమల ఏర్పాటు అధ్యాయనం ముగిసిపోలేదని ఆయన వెల్లడించారు. కడప ఉక్కు అంశంపై ఎంపీలు చర్చించారని తెలిపారు. ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై టాస్క్ ఫోర్స్ అధ్యయనం చేస్తోందన్నారు.
జగన్కు ఎలా తెలిసింది: కాల్వ
బీజేపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అజెండా ఒక్కటేనని మంత్రి కాల్వ శ్రీనివాసులు వేరుగా విమర్శలు గుప్పించారు. బీజేపీకి ఏపీలో వైసీపీ అధినేత వైయస్ జగన్ రహస్య నాయకుడు అన్నారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని జగన్ ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. వైసీపీ అజెండాను నిర్ణయించేది బీజేపీ అధిష్టానమే అన్నారు. తన గ్రాఫ్ పడిపోకముందే ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన ప్రధాని మోడీది అన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి చేతిలో పెరిగిన ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఎవరి కోసం పని చేస్తున్నారో అందరికీ తెలుసునని చెప్పారు. బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ పెడితే జగన్ హితులు, సన్నిహితులు రాయలసీమ ఉద్యమం చేస్తామని అంటారని విమర్శించారు. పరకాల ప్రభాకర్ పైన విమర్శలు చేయడమే వైసీపీ పనిగా పెట్టుకుందన్నారు.