జగన్ సర్కార్పై రాష్ట్రపతికి: అరాచక పాలన: నిమ్మగడ్డ వ్యవహారం.. కోర్టు తీర్పులు: టీడీపీ ఎంపీలు
అమరావతి: రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ హస్తిన వేదికగా సరికొత్త పోరాటానికి శ్రీకారం చుట్టినట్టు కనిపిస్తోంది. ఇదివరకు ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాలను దశలవారీగా కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఫిర్యాదు చేసిన టీడీపీ ఎంపీలు.. ఈ సారి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తోందని వివరించారు. వినతిపత్రాన్ని అందజేశారు.
రాష్ట్రపతితో భేటీలో..
తెలుగుదేశం పార్టీ లోక్సభ సభ్యులు గల్లా జయదేవ్, కేశినేని నాని, కింజరాపు అచ్చెన్నాయుడు, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ కొద్దిసేపటి కిందట రాష్ట్రపతి భవన్లో రామ్నాథ్ కోవింద్ను కలిశారు. ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు, ఏపీ హైకోర్టుల నుంచి జగన్ సర్కార్కు ప్రతికూలంగా వెలువడిన తీర్పుల గురించి ఆయనకు వివరించినట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా, చట్టానికి వ్యతిరేకంగా పని చేస్తోందంటూ వివరించడానికి న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులే సాక్ష్యాాధారాలని వారు రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
స్థానిక సంస్థల ఎన్నికలు, నిమ్మగడ్డ రమేష్ కుమార్
వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన ఈ 13 నెలల కాలంలో రాష్ట్రంలో దౌర్జన్యకర పరిస్థితులు నెలకొన్నాయని ఫిర్యాదు చేశారు. రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయడానికి వారిపై దాడులను కొనసాగిస్తోందని చెప్పారు. మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేషన్ల పర్వంలో చోటు చేసుకున్న ఉదంతాలు జగన్ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశాయని టీడీపీ ఎంపీలు రామ్నాథ్ కోవింద్ వివరించినట్లు సమాచారం. ప్రాథమిక హక్కులను హరించేలా, భావ ప్రకటనా స్వేచ్ఛను కాలరాసే విధంగా ఏపీ ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందని అన్నారు.
సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు..
ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకున్న వారిని అరెస్టు చేసిందని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ వంటి రాజ్యాంగ వ్యవస్థలకు ప్రాతినిథ్యాన్ని వహిస్తున్న వ్యక్తులపై దాడులు కొనసాగిస్తోందని, వారిని అవమానించేలా ప్రవర్తించిందని ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉదంతాన్ని వారు ఈ సందర్భంగా రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా వారు కొన్ని దినపత్రికల క్లిప్పింగులు, ఫొటోలను రాష్ట్రపతికి అందజేసినట్లు సమాచారం. ఏపీలో అరాచక పాలనకు స్వస్తి పలికేలా చర్యలను తీసుకోవాలని వారు రాష్ట్రపతిని కోరారు.