కడప స్టీల్ ప్లాంట్పై వారంలో ప్రకటన: కేంద్రమంత్రిని కలిసిన టీడీపీ ఎంపీలు
న్యూఢిల్లీ: కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ను శనివారం టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్, తదితరులు కలిశారు. రాష్ట్రంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని ఎంపీలు వినతిపత్రం సమర్పించారు.
టిట్లీతో భారీ నష్టం, రూ.1200కోట్లు ఇవ్వండి: మోడీకి చంద్రబాబు లేఖ, బైక్పై లోకేష్ పర్యటన
కడప స్టీల్ మీరు చేస్తారా? మేమే చేసుకోమంటారా?
ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వాలని ఎంపీలు కోరారు. అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంటుందని ఎంపీ సుజనా చౌదరి స్పష్టం చేశారు.
కేంద్రమంత్రిని నిలదీసిన ఎంపీలు
ఉక్కు కర్మాగారం ఎందుకు ఆలస్యం చేస్తున్నారని, ఏపీకి ఏమీ చేయకూడదని నిర్ణయానికి వచ్చారా? అని కేంద్రమంత్రిని నిలదీసినట్లు సీఎం రమేష్ చెప్పారు. తమ డిమాండ్లపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని భేటీ అనంతరం ఎంపీలు తెలిపారు.
వారం రోజుల్లో లేఖ
ఉక్కు కర్మాగారంపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని చెప్పారు. వారం రోజుల్లో కేంద్రం తరపున లేఖ విడుదల చేస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చినట్లు చెప్పారు. కేంద్రమంత్రికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు ఇచ్చామని సుజనా చౌదరి తెలిపారు. భూమి, విద్యుత్, నీరు, మౌలిక సదుపాయాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రికి తెలిపినట్లు చెప్పారు.
జీవీఎల్పై ఎంపీల ఫైర్
కాగా, రాజకీయ కారణాలతోనే కడప స్టీల్ ప్లాంటుపై కేంద్రం తాత్సారం చేస్తుందని ఎంపీ టీజీ వెంకటేష్ ఆరోపించారు. ఏపీలో ఆధార్ కార్డులేని బీజేపీ ఎంపీ జీవీఎల్కు ఏం అవగాహన ఉందని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏపీలో విషయాల్లో జీవీఎల్ జోక్యం చేసుకోకపోవడమే ఉత్తమమని అన్నారు. ఐటీ దాడులు కక్షపూరితంగానే జరుగుతున్నాయని ఆరోపించారు.