కేంద్రం భయపడుతోంది, ఏం చేతకాదా: బీజేపీపై టీడీపీ ఎంపీలు
Recommended Video
న్యూఢిల్లీ: అవిశ్వాసం తీర్మానం ఇచ్చినప్పటికీ దానిపై చర్చకు కేంద్ర ప్రభుత్వం పారిపోతోందని టీడీపీ ఎంపీలు సోమవారం మండిపడ్డారు. నాలుగేళ్లుగా ఏపీకి అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పి పబ్బం గడిపారన్నారు. టీడీపీ ఎంపీలు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు.
ఇప్పుడు సభలో సమాధానం చెప్పలేకపోతోందన్నారు. ఏపీ ప్రయోజనాల విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. ఏపీకి జరిగిన అన్యాయ్యాన్ని పార్లమెంటులో నిలదీస్తామన్నారు. ప్రధాని మోడీ లోకసభలో మాట్లాడిన రోజు కేంద్రమంత్రి అనంత్ కుమార్ తమతో మాట్లాడి ఆందోళన చేయవద్దని చెప్పారని తెలిపారు.
ఈ రోజు టీఆర్ఎస్, అన్నాడీఎంకే సభ్యులతో కేంద్రం మాట్లాడి సభ సక్రమంగా జరిగేలా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. సభ జరగకుండా స్పీకర్, కేంద్రం మ్యచ్ ఫిక్సింగ్ చేసినట్లు అనుమానం కలుగుతోందన్నారు.
ఆందోళన చేస్తున్న ఎంపీలతో చర్చించి సభ జరిగేలా చేయడం ప్రభుత్వానికి చేతకాదా అని ప్రశ్నించారు. ఉగాది సందర్భంగా స్పీకర్ విందుకు ఆహ్వానిస్తే తిరస్కరించినట్లు చెప్పారు.
ఓ పక్క కేంద్రం ఏపీని చిన్నచూపు చూస్తూ అవమానిస్తుంటే విందుకు ఎలా వెళతామన్నారు. కేవలం రాజకీయ ఎత్తుగడతోనే బీజేపీ ఏపీ పట్ల వివక్ష చూపుతోందన్నారు. విభజన సమస్యలపై చర్చ జరిగే వరకూ రోజూ అవిశ్వాస తీర్మానం ఇస్తామన్నారు.