మోడీ బావా..: థర్డ్ జెండర్ వేషంలో శివప్రసాద్ నిరసన, సోనియాగాంధీ ప్రశంసలు
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంటులో, ఆవరణలో నిరసన తెలుపుతున్నారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ శుక్రవారం విచిత్ర వేషధారణలో నిరసన తెలిపారు. గత పద్దెనిమిది రోజులుగా వారు ఆందోళన చేపడుతున్నారు. సభలో ప్లకార్డులు పట్టి నిరసన తెలుపుతున్నారు. నినాదాలు చేస్తున్నారు.
ఎంపీ శివప్రసాద్ థర్డ్ జెండర్ ప్రతినిధిగా శుక్రవారం పార్లమెంటులో నిరసన తెలిపారు. మోడీ బావా.. ప్రత్యేక హోదా ఇవ్వకుంటే నీ అంతం ఆరంభం అంటూ ఆలపించారు. మాటలు ఎన్నో చెప్పావని, చేతల్లో మాత్రం చేయలేదని ఆరోపించారు. ఎన్ని వేషాలు వేసినా మోడీ మనసు కరగడం లేదని, అందుకే ట్రాన్స్ జెండర్ వేషం వేయాల్సి వచ్చిందని అన్నారు.
అక్రమాస్తుల కేసులో ముద్దాయిగా భారతి పేరు: ఇంత దారుణమా... షాకైన జగన్
శివప్రసాద్కు సోనియా గాంధీ అభినందన
ఎన్నికల ప్రచారంలో భాగంగా నవ్యాంధ్ర ప్రదేశ్కు అది చేస్తాం.. ఇది చేస్తామని మోడీ చెప్పారని శివప్రసాద్ అన్నారు. అప్పుడు ఇచ్చిన హామీలను ఆయన ఇప్పుడు మరిచిపోవడం దారుణమన్నారు. రోజుకొక విచిత్ర వేషధారణలతో ఆందోళన చేస్తున్న శివప్రసాద్ను కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ అభినందించారు.
రైల్వే జోన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు
ఏపీకి కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయానే బీజేపీ కూడా చేస్తోందని రాజ్యసభ టీడీపీ సభ్యులు సుజనా చౌదరి మండిపడ్డారు. రైల్వే లైన్లు సక్రమంగా లేని ప్రాంతాల్లో కూడా గతంలో రైల్వే జోన్లు ఇచ్చారని, అలాంటిది అత్యధిక ఆదాయాన్ని సమకూర్చే విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని మరో ఎంపీ అవంతి శ్రీనివాస్ ప్రశ్నించారు.
మోడీజీ! ఆత్మవిమర్శ చేసుకోండి
వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఏకంగా ఏడు రైల్వే జోన్లు ఇచ్చారని టీడీపీ ఎంపీలు గుర్తు చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం నాలుగేళ్లలో ఒక్క రైల్వే జోన్ కూడా ఇవ్వలేకపోయిందని మండిపడ్డారు. మీ ప్రభుత్వం విఫలమైందా సఫలమైంద ఆత్మవిమర్శ చేసుకోవాలని మోడీకి హితవు పలికారు. రైల్వేజోన్ వచ్చేంత వరకు ఆందోళన చేస్తామన్నారు.
ఏపీ వాళ్లు తెలివితక్కువ వాళ్లు కాదు
కాగా, గురువారం లోకసభలో హోదా విషయంలో ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈశాన్య రాష్ట్రాలకు పారిశ్రామిక రాయితీలను కల్పించిన కేంద్రం ఏపీకి ఎందుకు ఇవ్వదని నిలదీశారు. ఏపీ ప్రజలను రాజకీయ నిరక్షరాస్యులుగా భావించొద్దని, వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారన్నారు. జీఎస్టీ సవరణ బిల్లుపై గురువారం లోక్సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వాలని 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేయలేదని ఒకవైపు కేంద్రమంత్రి వర్గమంతా దండోరా వేస్తూనే మరోవైపు ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా పేరుతో పన్ను రాయితీలను ఎలా కల్పిస్తున్నారన్నారు. ఏపీ ప్రజలను తెలివి తక్కువవాళ్లుగా, రాజకీయ నిరక్షరాస్యులుగా భావించవద్దన్నారు.