‘ఏపీపై కేంద్రానిది వివక్షే! ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నారు’
న్యూఢిల్లీ: కేంద్రం ఏపీ ప్రజలను మోసం చేయడం సరికాదని తెలుగుదేశం పార్టీ ఎంపీలు అన్నారు. విభజన హామీలు కేంద్రం నెరవేర్చడం లేదంటూ మంగళవారం పార్లమెంటు లోపల, బయటా వారు నిరసనలు తెలిపారు.
విభజన చట్టంలోని హామీలు అమలు చేయకుండా కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలపై దాడి చేస్తోందని టీడీపీ ఎంపీలు ఆరోపించారు. ఇది మంచి పద్ధతి కాదని వ్యాఖ్యానించారు.
రాజీనామాల తర్వాత తొలిసారి
కాగా, కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశాక తొలిసారి ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత సుజనాచౌదరి మంగళవారం గాంధీ విగ్రహం ముందు ధర్నాలో పాల్గొన్నారు. ఆయనతోపాటు కేంద్ర మాజీ మంత్రి అశోక్గజపతిరాజు, లోక్సభ నేత తోట నరసింహం, ఎంపీలు కొనకళ్ల నారాయణ, పి.రవీంద్రబాబు, అవంతి శ్రీనివాస్, మురళీమోహన్, గల్లా జయదేవ్, నిమ్మల కిష్టప్ప, మాగంటి బాబు, కె.రామ్మోహన్నాయుడు, కేశినేని నాని, శ్రీరాంమాల్యాద్రి, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్రావు, తోట సీతారామలక్ష్మిలు ప్లకార్డులు పట్టుకొని ఏపీకి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు..
పార్లమెంటులో నిరసనలు: ప్రత్యేక ఆకర్షణగా ప్రిన్స్ మహేష్ మేనల్లుడు, హోదా నినాదాలు
దేశాన్ని నడిపేది ఆఫీసర్లా?
సోమవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి వద్ద జరిగిన సమావేశంలో రైల్వే అధికారులు జోన్ సాధ్యం కాదంటూ చేసిన వ్యాఖ్యలపై సుజనాచౌదరి మండిపడ్డారు. ఆఫీసర్లు దేశాన్ని నడపలేరని, కేంద్ర మంత్రితో మాట్లాడి దాని సంగతి తేలుస్తామన్నారు. రైల్వేజోన్ అవసరమా? కాదా? అని తేల్చడానికి వీరికి నాలుగేళ్ల సమయం ఇవ్వలేదన్నారు. విభజన చట్టంలో పెట్టినందున కచ్చితంగా ఇవ్వాల్సిందేనని అన్నారు.
టీడీపీకి షాక్: 22మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు
సమన్వయమేదంటూ సుజనా ఆగ్రహం
అంతేగాక, ‘దుగరాజపట్నం బదులు ప్రత్యామ్నాయ నౌకాశ్రయాన్ని ఇస్తామని ఆర్థికమంత్రి రాజ్యసభలో చెప్పారు. ఈ ప్రభుత్వంలో కుడి చేయి ఏం చేస్తోందో ఎడమ చేయికి తెలియడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం చేసుకోవాలన్నది నా సలహా' అని సుజనా చౌదరి అన్నారు. కాగా, సర్దార్ పటేల్ వేషంలో చిత్తూరు ఎంపీ శివప్రసాద్ నిరసనలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘మోడీ ఎందుకు పొరపాటు చేస్తున్నారు? నాకు విగ్రహం ఏర్పాటుచేసినంత మాత్రాన సంతోషం కలగదు. ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడే ఆనందం' అని వ్యాఖ్యానించారు.
మనోభావాలు దెబ్బ తీయొద్దని అశోక్.. వివక్షే
ప్రజల మనోభావాలను దెబ్బతీయడం ఎవ్వరికీ మంచిది కాదని మరో మాజీ కేంద్రమంత్రి అశోక్గజపతిరాజు అన్నారు. ప్రజలపైన ఎదురుదాడి ఎందుకని ప్రశ్నించారు. ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ.. రైల్వేజోన్ తప్పక ఇస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు ప్రకటించారని, ఇప్పుడు అదికూడా సాధ్యం కాదంటున్నారని విమర్శించారు. దీన్ని బట్టి కేంద్రం ఆంధ్రప్రదేశ్పై ఏ స్థాయిలో వివక్ష చూపుతుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. కాగా, మంగళవారం గల్లా జయదేవ్ కుమారుడు, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ మేనల్లుడు సిద్ధార్థ్ కూడా పార్లమెంటు ఆవరణలో హోదా ప్లకార్డులతో నినాదాలు చేశారు.