వేరే వారికి పుట్టిన బిడ్డకు..: వైఎస్ జగన్ కు నారా లోకేష్ చురకలు
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ మరోసారి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కఠిన పదజాలంతో విమర్శలు గుప్పించారు. అనంతపురం జిల్లాలో విద్యుత్ ఆధారిత బస్సులను తయారు చేయడానికి పెట్టుబడులు వీర వాహన్ ఉద్యోగ్ లిమిటెడ్ ముందుకు రావడం నారా లోకేష్ ఆగ్రహానికి కారణమైంది. తమ ప్రభుత్వ హయాంలోనే ఆ సంస్థ పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించిందని, జగన్ ప్రభుత్వం దాన్ని తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నం చేస్తోందంటూ నారా లోకేష్ ఆరోపణలు చేశారు. ఈ మేరకు శుక్రవారం వరుస ట్వీట్లను సంధించారు.
కలగూర గంప కూటమి: శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ సర్కార్ ఆయువు ఏడెనిమిది నెలలే: కేంద్రమంత్రి
వెయ్యి కోట్ల రూపాయలతో..
అనంతపురం జిల్లాలో వెయ్యి కోట్ల రూపాయల తొలిదశ పెట్టుబడితో ఓ భారీ పరిశ్రమను నెలకొల్పడానికి వీర వాహన ఉద్యోగ్ లిమిటెడ్ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. విద్యుత్ తో నడిచే బస్సులను తయారు చేసే సంస్థ అది. ఏటా మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేసే సామర్థ్యంతో అనంతపురం జిల్లాలో పరిశ్రమలను నెలకొల్పడానికి ఆసక్తిని చూపింది. ఈ విషయాన్ని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే ఆ సంస్థ అనంతపురం జిల్లాలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిందనేది నారా లోకేష్ వాదన.
వేరే వారికి పుట్టిన బిడ్డకు..
వేరే వారికి పుట్టిన బిడ్డకు తండ్రినని వైఎస్ జగన్ చెప్పుకొంటున్నారని, ఈ విధానాన్ని మానుకోవాలని నారా లోకేష్ హితవు పలికారు. తమ ప్రభుత్వ హయాంలో వీర వాహన్ ఉద్యోగ్ లిమిటెడ్ సంస్థకు భారీ ఎత్తన రాయితీలు ఇచ్చామని ఆయన చెబుతున్నారు. భూములను సైతం కేటాయించామని అన్నారు. ఇంత శ్రమించి తాము తీసుకొచ్చిన కంపెనీకి ఇప్పుడు వైఎస్ జగన్ తమ పార్టీ రంగు పూయాలని తెగ తాపత్రయపడుతున్నారని ఎద్దేవా చేశారు. వేరే వారికి పుట్టిన బిడ్డకి మీరు తండ్రి అని చెప్పుకోవడం మాని, సొంతంగా ఏదైనా సాధించి, అప్పుడు డప్పు కొట్టుకోవాలని అన్నారు.
స్మశానాలకు రంగులు వేసుకునే పార్టీ..
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్మశానాలను సైతం వదలకుండా రంగులు వేస్తోందని, అలాంటి పార్టీకి నాయకత్వాన్ని వహిస్తోన్న వైఎస్ జగన్ కు ఇంతకంటే మంచి ఆలోచనలు వస్తాయని తాను అనుకోవట్లేదని చెప్పారు. అలా అనుకోవడం అత్యాశే అవుతుందని అన్నారు. వీర వాహన సంస్థని రాష్ట్రానికి తీసుకురావడానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా కష్ట పడ్డారని చెప్పారు. ఆ కష్టం అందరికీ తెలుసని చెప్పారు. వైఎస్ జగన్ ను చూసి రాష్ట్రానికి రావాల్సిన కంపెనీలు కూడా బై బై ఏపీ అంటున్నాయని ఆరోపించారు. చేసేది ఏమీ లేక చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు తామే తెచ్చామని జగన్ బిల్డప్ ఇస్తున్నారని విమర్శించారు.