బాబును వదలొద్దు, నేను కౌంటర్ ఇస్తా, ఇస్తామన్నా తీసుకోవట్లేదు, ఆధారాలు: అమిత్ షా షాక్
న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని ఇప్పటికే కేంద్రమంత్రులు తేల్చి చెప్పారు. తాజాగా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ శనివారం మాట్లాడుతూ.. హోదా విషయమై తమ పార్టీ చెబుతుందని అన్నారు. ఎన్డీయేకు టీడీపీ గుడ్ బై చెప్పిన నేపథ్యంలో ఏపీ బీజేపీ నేతలతో అమిత్ షా, రామ్ మాధవ్ మాట్లాడిన విషయం తెలిసిందే.
చదవండి: 'ఊసరవెళ్లి..ఇదిగో ఇలానా' 'ఒత్తిడిలో చంద్రబాబు', పవన్పై విమర్శలకు ప్రశ్నల వర్షం!
ఏపీ ప్రజల ముందు బీజేపీని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న టీడీపీపై దండయాత్ర ప్రారంభించాలని, ఏపీ టీడీపీలో అవినీతికి సాక్ష్యాలు ఉంటే వదిలి పెట్టవద్దని, నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలని, ఏపీకి ఏం చేశామో చెప్పి సెంటిమెంటును అధిగమించాలని ఏపీ బీజేపీ నేతలకు అమిత్ షా దిశానిర్దేశనం చేశారని తెలుస్తోంది.
చదవండి: నిధులిచ్చాం, అమరావతి వెళ్తే ఏం కనిపించదు: బాబుపై గోయల్ ఎదురుదాడి, అవిశ్వాసంపై
బాబుకు కౌంటర్ ఇస్తా, సెంటిమెంట్ నిజమే.. అధిగమించాలి
విభజన హామీలు అమలు చేయలేదని చెబుతూ, ఎన్డీయే నుంచి వైదొలుగుతున్నట్లు తనకు లేఖ రాసిన ఏపీ సీఎం చంద్రబాబుకు తాను కౌంటర్ ఇస్తానని అమిత్ షా ఏపీ బీజేపీ నేతలతో చెప్పారు. ఏపీలో బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషించాలని, టీడీపీ ప్రభుత్వం అవినీతి, వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలను ఢీకొట్టాలన్నారు. హోదా అంశం సెంటిమెంటుగా మారిందని, దానిని అడ్డుపెట్టి బీజేపీని విలన్గా చూపిస్తున్నారని నేతలు చెప్పగా.. అది నిజమేనని, కానీ మనం ఏపీకి చేసిన దానిని చెప్పి దానిని అధిగమించాలన్నారు.
ఏం చేశామో, చేస్తామో చెప్పండి
ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటన సాధ్యం కాదని, కానీ దాని బదులు సమానమైన ప్యాకేజీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రజలకు వివరించాలని, చంద్రబాబుకు తాను ప్రత్యుత్తరం రాస్తానని, అందులోని అంశాలనూ ప్రజల్లోకి తీసుకెళ్లాలిని అమిత్ షా సూచించారు. టీడీపీ ఎన్డీయే, కేంద్ర ప్రభుత్వాల నుంచి వైదొలగడానికి కారణాలేమిటో కేంద్ర మంత్రులు, రాష్ట్ర నాయకులు రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేయాలని, కేంద్ర సాయం, రాష్ట్ర వైఫల్యాలతో నివేదిక తయారుచేసి ప్రచార ప్రణాళిక ఖరారు చేయాలన్నారు.
భావోద్వేగాలు రెచ్చగొడితే చేసింది చెప్పి నిర్వీర్యం చేయాలి
హోదా అంశంతో వాళ్లు ఎలా భావోద్వేగాలు రెచ్చగెడుతున్నారో అలాగే మనం నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించాలని, విభజన చట్టంలో చెప్పినవన్నీ ఒకేసారి ఇస్తే టీడీపీ ఒత్తిడితో ఇచ్చినట్లవుతుందని, నెలా రెండునెలల తర్వాత ఒక్కొక్కటిగా పరిష్కరిద్దామని, రాష్ట్రంలో బీజేపీ రాజకీయ మనుగడకు అధికార పార్టీతో యుద్ధం చేయాలని, టీడీపీపై విమర్శల దాడి పెంచాలని, మన పార్టీపై ప్రజలను ఉసిగొల్పడంతో చంద్రబాబు విజయవంతమైనట్లు మీరు చెబుతున్నారని, మనం కౌంటర్ చేయడం ప్రధానమని అమిత్ షా చెప్పారు.
నిధులుస్తామన్నా, చంద్రబాబు అలా ఎందుకు చేయలేదో అడగండి
టీడీపీ అవినీతిపై జనసేన అధినేత పవన్ మాట్లాడారని చెప్పగా, ఆధారాలు ఉంటే మనమూ మాట్లాడాలని, లేదంటే వైఫల్యంపై మాట్లాడాలని అమిత్ షా సూచించారని తెలుస్తోంది. స్పెషల్ పర్సస్ వెహికిల్ ఏర్పాటు చేసుకుంటే హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామని చెప్పినా చంద్రబాబు ఎందుకు స్పందించలేదో ప్రశ్నించాలని, దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
చంద్రబాబు అడిగిన వాటికి ఓకే చెప్పాం, లేఖలున్నాయి
బీజేపీ ఏం చేసింది, ఏం చేస్తుందో చెప్పడానికి యాత్ర చేపట్టాలని అమిత్ షా సూచించారు. డబ్బులిచ్చినా రాజధానిలో కదిలక లేదని, కేంద్ర నిధుల వినియోగ పత్రాలు లేవని, హోదాకు సమానమైన మొత్తాన్ని ఈఏపీలు, నాబార్డు, స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా ఇవ్వాలని చంద్రబాబు అడిగిన లేఖలన్నీ మన దగ్గరున్నాయని, అన్నింటిని అంగీకరించినా ఎందుకు తీసుకోవడం లేదో నిలదీయాలని సూచించారు. పారిశ్రామిక రాయితీల కింద పెట్టిన రూ.100 కోట్లు ఎందుకు ఖర్చు చేయలేదో ప్రశ్నించాలన్నారు. వీటితో పాటు రూ.80 వేల కోట్ల రైతు రుణమాఫీకి రూ.11 వేలు కోట్లే ఇవ్వడం, నిరుద్యోగభృతి ఇవ్వకపోవడం, ప్రాజెక్టులు ప్రారంభించకపోవడం వంటి వైఫల్యాల్ని ఎండగట్టాలన్నారు.
ప్రశాంత్ కిషోర్ కలకలం
చంద్రబాబు చేసిన తప్పులు వెతకాలని రామ్ మాధవ్ కూడా ఏపీ బీజేపీ నేతలకు సూచించారు. ఢిల్లీ నుంచి కూడా తగిన ఆధారాలు బయటపెట్టేందుకు సిద్ధమన్నారు. ఇదిలా ఉండగా, అమిత్ షా నివాసంలో ఏపీ బీజేపీ నేతల భేటీలో ప్రశాంత్ కిషోర్ వచ్చారన్న కలకలం రేగింది. ప్రశాంత్ వచ్చినట్లు ఓ విలేకరి చెప్పారు. దీనిపై ఏపీ బీజేపీ నేతలను అడగ్గా.. ఆయన వచ్చారని, ఆయన ఏపీ నాయకుల సమావేశంలో కాకుండా వేరే గదిలో కూర్చున్నారని చెప్పారట. మరోవైపు అసలు ఆయన ఢిల్లీలోనే లేరని ప్రశాంత్ కిషోర్ కార్యాలయం ట్విట్టర్ ద్వారా తెలిపింది.