'కిరణ్ కుమార్ రెడ్డి చేరుతారని చెప్పలేదు, తమ్ముడు టిడిపి నుంచే పోటీ'
అమరావతి: సమైక్యాంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కిరణ్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఇరు పార్టీల మధ్య సంబంధాలు ఉన్నాయని, కిరణ్ రెడ్డి టిడిపిలో చేరుతారంటూ పలు విధాల ప్రచారం సాగింది. దీనిపై మంత్రి అమర్నాథ్ రెడ్డి స్పందించారు.
Recommended Video
కిరణ్ రెడ్డి టీడీపీలో చేరుతారని తాము ఎప్పుడూ చెప్పలేదని అమర్నాథ్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై నమ్మకంతోనే కిరణ్ సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారని చెప్పారు. కిషోర్ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫునే పోటీ చేస్తారని చెప్పారు.
బీజేపీ, వైయస్సార్ కాంగ్రెస్ ఒక్కటైనందున కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలుస్తాయని అనుకోవడం సరికాదని అమర్నాథ్ రెడ్డి అన్నారు. గత కొన్నాళ్ల పరిణామాలు చూస్తూ టీడీపీ, కాంగ్రెస్ ఒక్కటవుతాయా అనే చర్చ సాగుతోన్న విషయం తెలిసిందే.