చంద్రబాబు అమరావతి బూమరాంగ్ - ఒత్తిడిలో ఉత్తరాంధ్ర, సీమ నేతలు- 16నుంచి వైసీపీలోకి ..
ఏపీలో ఈ నెల 16న మూడు రాజధానులకు శంఖుస్ధాపన కోసం వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ విపక్ష టీడీపీ అమరావతి కోసం చేస్తున్న పోరాటం ఆ పార్టీలోని ఇతర ప్రాంతాల నేతలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. అటు అమరావతిని సమర్దించలేక, అలాగని మూడు రాజధానులకు మద్దతివ్వలేక, తమ ప్రాంతంలోని ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా పనిచేయలేక వారు నలిగిపోతున్నట్లు తెలుస్తోంది. దీంతో వీరిలో చాలా మంది ఈ నెల 16 తర్వాత అధికార పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
Recommended Video
చంద్రబాబు అమరావతి బాట...
ఏపీలో మూడు రాజధానులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు.. అమరావతికి మద్దతుగా స్వరం పెంచుతున్నారు. రోజుకో ప్రెస్మీట్తో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. అమరావతి వల్ల ప్రయోజనాలను ఏకరువు పెడుతున్నారు. అమరావతికి పెట్టిన ఖర్చు, అక్కడి సెంటిమెంట్, రైతుల ప్రయోజనాలు వంటి ఎన్నో అంశాలను తెరమీదకు తీసుకొచ్చి రాజధాని మార్చొద్దని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం పదే పదే తమకు సంబంధం లేదని చెబుతున్నా... జోక్యం చేసుకుని తీరాల్సిందే అంటున్నారు. రాజధాని మారిస్తే ఐదుకోట్ల మందికి నష్టమనే వాదనను చంద్రబాబు పదేపదే తెరమీదకు తీసుకొస్తున్నారు. దీంతో అమరావతితో ఐదు కోట్ల మందికి లాభమా నష్టమా అన్న అంశంపై ఇప్పుడు మిగిలిన ప్రాంతాల్లోనూ చర్చ సాగుతోంది.
ఒత్తిడిలో ఉత్తరాంధ్ర, సీమ నేతలు...
అమరావతినే రాజధానిగా ఉంచాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న వాదనతో ఉత్తరాంధ్ర, రాయలసీమలోని ఆ పార్టీ నేతలపై స్ధానికంగా ఒత్తిడి పెరుగుతోంది. గతంలో అమరావతికి మద్దతుగా వీరితో ఉద్యమాలు చేయిద్దామని చంద్రబాబు భావించినా అది సాధ్యం కాలేదు. విశాఖ ఎయిర్పోర్టులోనే చంద్రబాబును వైసీపీ అడ్డుకున్నా.. ఆయనపై సానుభూతి రాలేదు. దీంతో ఆ తర్వాత స్ధానిక ఎన్నికలపైనే దృష్టిపెట్టిన చంద్రబాబు.. అనంతరం కరోనా కారణంగా హైదరాబాద్కే పరిమితమయ్యారు. అయితే అక్కడి నుంచి కూడా అమరావతి స్వరాన్నే ఆయన వినిపిస్తున్నారు. దీంతో తమ ప్రాంతానికి వస్తున్న రాజధానులను వ్యతిరేకించలేక, అలాగని అమరావతికి మద్దతు ఇవ్వలేక ఉత్తరాంధ్ర, రాయలసీమ టీడీపీ నేతలు నలిగిపోతున్నారు.
అమరావతికి మద్దతివ్వాలని ఒత్తిడి...
అమరావతికి మద్దతుగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోనూ స్వరాలు వినిపించాలని, ఆ మేరకు వీలైతే ఉద్యమాలు కూడా చేయాలని అధిష్టానం నుంచి టీడీపీ నేతలపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో అమరావతిని సమర్ధిస్తూ బీటెక్ రవి వంటిి కొందరు నేతలు అక్కడక్కడా స్వరం విప్పుతున్నారు. వీరు మినహా మిగిలిన సీనియర్ నేతలంతా అమరావతే కాదు జగన్ సర్కారు మూడు రాజధానులపై స్పందించేందుకు సైతం నిరాకరిస్తున్నారు. ఏం మాట్లాడితే ప్రజల నుంచే ఏం విమర్శలు వస్తాయో అన్న ఆందోళన వీరిలో కనిపిస్తోంది. దీంతో వీరంతా మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. మరికొందరు మాత్రం టీడీపీని వీడి అధికార వైసీపీలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఈ నెల 16 తర్వాత జంపింగ్స్..
ఇలా అమరావతిని సమర్ధించలేక ఇబ్బందులు పడుతున్న ఉత్తరాంధ్ర, రాయలసీమ టీడీపీ నేతలు ఇప్పుడు అధికార వైసీపీవైపు చూస్తున్నారు. వైసీపీలో చేరిపోతే తమ ప్రాంతానికి వచ్చే రాజధానిని సమర్ధించేందుకు అవకాశం దొరుకుతుందని, అప్పుడు తమ ప్రాంతం అభివృద్ధి వాదనను కూడా ప్రజల్లోకి సులువుగా తీసుకెళ్లొచ్చనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 16న ప్రభుత్వం మూడు రాజధానులకు విశాఖలో శంఖుస్ధాపన చేయబోతోంది. ఈ సందర్భంగా విశాఖకు చెందిన గంటా శ్రీనివాస్ తో పాటు మరికొందరు టీడీపీ నేతలు వైసీపీ కండువా కప్పుకోవచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత మిగతా నేతలు వరుసగా వైసీపీ బాట పడతారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.