నేను అందుకే ఏపీకి వచ్చా: అమిత్ షాకు చేదు అనుభవం, టీడీపీ శిరీష అరెస్ట్
పలాస: శ్రీకాకుళం జిల్లా పలాసలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ), తెలుగు దేశం పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బీజేపీ బస్సు యాత్రను అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నాలు చేశాయి. అమిత్ షా సభను కూడా అడ్డుకునే ప్రయత్నం చేశాయి. వారి బస్సు యాత్రను నిరసిస్తూ పలాసలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
నేను-నా అవినీతి: 'అధికార', 'ప్రతిపక్షా'లకు నాగబాబు పెట్టిన జబర్దస్త్ పరీక్ష
అమిత్ షా గో బ్యాక్ అంటూ నినాదాలు, శిరీష అరెస్ట్
అమిత్ షా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ మేరకు ప్లకార్డులు ప్రదర్శించారు. 'గో బ్యాక్.. గో బ్యాక్.. ఆంధ్రుల ద్రోహులు బీజేపీ నాయకులు... అమిత్ షా గో బ్యాక్.. గో బ్యాక్' అని ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీకి కూడా వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న పలాస ఎమ్మెల్యే గౌతు శివాజీ, జిల్లా టీడీపీ అధ్యక్షురాలు శిరీషను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏం చేశామో చెప్పి అడుగు పెట్టండి
బీజేపీ నేతలపై శిరీష నిప్పులు చెరిగారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని అమలు చేయాలన్నారు. కొత్తగా ఏర్పడిన ఏపీకి సాయం చేయాలన్నారు. ఏపీకి హోదా, నిధులు ఏమీ ఇవ్వలేదని చెప్పారు. ఏపీని తొక్కేయడానికి బీజేపీ చూస్తోందన్నారు. ఏపీ పైన బీజేపీకి చిన్నచూపు అన్నారు. పటేల్ విగ్రహం పెట్టడానికి ఇచ్చిన నిధులు ఇవ్వలేదన్నారు. మరో మూడు నెలలు ఆగండని, ఏపీలో బీజేపీకి ఒక్క సీటు కాదుకదా.. జెండాలు ఎన్ని పెట్టారో అన్ని ఓట్లు రావన్నారు. మూడు నెలల్లో కేంద్రంలో కూడా అధికారం కోల్పోతుందన్నారు. ఏపీకి ఏం చేశామో చెప్పి అడుగు పెట్టాలని బీజేపీ నేతలను హెచ్చరించారు.
అందుకే ఏపీకి వచ్చా.. అమిత్ షా
మరోవైపు, నిరసనలు, ఉద్రిక్తతల మధ్య అమిత్ షా బస్సు యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు ప్రతి విషయంలో యూటర్న్ తీసుకున్నారని చెప్పారు. మోసపూరిత రాజకీయాలు చేసే టీడీపీకి బుద్ధి చెబుతామని అన్నారు. టీడీపీ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. అందుకే తమపై నిందలు వేస్తున్నారన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ పార్టీ పెడితే చంద్రబాబు నయవంచన చేశారన్నారు. ఏపీలో బీజేపీ బలోపేతానికి సహకరించాలని కోరారు. ప్రధానిపై చంద్రబాబు అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. మోడీ సర్కారు ఏపీకి చేసిన పనులు చెప్పేందుకే తాను వచ్చానని చెప్పారు. టీడీపీ తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిందన్నారు.