వైసీపీ బాధితుల కోసం టీడీపీ కంట్రోల్ రూమ్- న్యాయసహాయం ఇలా పొందొచ్చు...
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏడాదిన్నర పాలనకు చేరువవుతున్న నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. జిల్లాల్లో, గ్రామాల్లో వర్గపోరు పెరిగింది. పలు చోట్ల అధికార వైసీపీ, విపక్ష టీడీపీ నేతలు సై అంటే సై అంటున్నారు. పోలీసులు అధికార పార్టీ చెప్పినట్లు ఆడుతూ తమను లక్ష్యంగా చేసుకుంటున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. అక్రమ నిర్భంధాలు, అకృత్యాలు పెరిగియాయి. ఇదే క్రమంలో తమ కార్యకర్తలతో పాటు సాధారణ జనానికి అండగా నిలిచేందుకు టీడీపీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీలో వైసీపీ ప్రభుత్వ బాధితులుగా మారిన వారికి అవసరమైన న్యాయ సహాయం అందించాలని టీడీపీ నిర్ణయించింది. ఇందుకోసం ఓ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. 7306299999 నంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలిపితే వాటిని నమోదు చేసుకుని అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని ఎమ్మెల్సీ దీపక్రెడ్డి ప్రకటించారు. టీడీపీ కార్యకర్తలకు ఆ పార్టీ న్యాయ విభాగం ఇప్పటికే అవసరమైన సాయం అందిస్తుండగా.. ఇది వైసీపీ బాధితుల కోసం ఏర్పాటు చేశారు.

వైసీపీ పాలనలో తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలు ఎదుర్కొంటున్న వారికి కంట్రోల్ రూమ్ ద్వారా న్యాయ సహాయం అందనుంది. రాష్ట్రంలో పలు చోట్ల వైసీపీ నేతల చేతుల్లో దాడులకు గురవుతున్న వారిపైనే పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని, ఇలాంటి వారికి తమ కంట్రోల్ రూమ్ అవసరమైన సాయం అందిస్తుందని టీడీపీ చెబుతోంది.