మళ్లీ అగ్గి రాజుకుంది : రీ పోలింగ్ కారణం సీఎస్: టీడీపీ మండిపాటు: ఎల్వీ ఖండన..!
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి..అధికార పార్టీ మధ్య సద్దుమణిగిన వివాదం మరో కారణంతో మరో సారి రాజుకుంది. చిత్తూరు జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గంలో రీ పోలింగ్ నిర్ణయం పైన టీడీపీ మండిపడుతోంది. దీనికి ప్రధన కారణం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం అని టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. దీని పైన సీఎస్ స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.
రీ పోలింగ్ వివాదంలోకి సీఎస్..
చంద్రగిరిలో అయిదు కేంద్రాల్లో ఎన్నికల సంఘం రీ పోలింగ్కు నిర్ణయించింది. ఇది రాజకీయంగా ఏపిలో రగడ సృష్టించింది. వైసీపీ ఫిర్యాదుల ఆధారంగా ఎన్నికల సంఘం ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటుందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు మొదలు పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీని పైన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు. అయితే, వైసీపీ అభ్యర్ది నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇచ్చిన ఫిర్యాదు..ఆయన సిఫార్సు ఆధారంగానే కేంద్ర ఎన్నికల సంఘం రీ పోలింగ్కు నిర్ణయించిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రగిరి నుండి పోటీలో ఉన్న వైసీపీ అభ్యర్ది చెవిరెడ్డి భాస్కరరెడ్డి సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంను కలిసి తన నియోజకవర్గంలో దళితులను ఓట్లు వేయనీకుండా టీడీపీ అడ్డుకుందని..పోలింగ్ కేంద్రాల్లో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించి రీ పోలింగ్కు సిఫార్సు చేయాలని సీఈవో తో పాటుగా సీఎస్కు ఫిర్యాదు చేసారు. దీని పైన సీఎస్ సిఫార్సు ఆధారంగానే ఎన్నికల సంఘం రీ పోలింగ్కు నిర్ణయం తీసుకుందన్నది టీడీపీ నేతల వాదన.
సీఎస్ దగ్గరకు ఎందుకు వెళ్లారు..
పోలింగ్ వ్యవహారం పైన ఫిర్యాదులు ఉంటే ఎన్నికల ప్రధానాధికారిని కలిసి ఫిర్యాదు చేయాలి కానీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలవాల్సిన అవసరం ఏంటని టీడీపీ ప్రశ్నిస్తోంది. చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు పరిగణలోకి తీసుకోవాలని సీఎస్ కోరుకుంటున్నారంటూ ద్వివేదీకి సీఎస్ ఓఎస్డీ లేఖ రాసారు. దీని ఆధారంగా సీఈవో ద్వివేదీ పోలింగ్ కేంద్రాల్లోని సీసీ టీవీ ఫుటేజ్లను పరిశీలించి అయిదు కేంద్రాల్లో రీ పోలింగ్కు కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తనకు సంబంధం లేని వ్యవహారంలో సీఎస్ ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీంతో..ఇప్పుడు వ్యవహారం సీఎస్ వైపు టర్న్ అయింది. దీని ద్వారా సద్దుగణిగిన సీఎస్-కేబినెట్ మధ్య గ్యాప్ ఈ వ్యవహారం ద్వారా మరో సారి మొదలైనట్లు కనిపిస్తోంది.
ఖండించిన సీఎస్..
తన పైన వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం స్పందించారు. తన వద్దకు వచ్చిన పిర్యాదులో దళితులను ఓట్లు వేయనీయలేదనే అంశం ఉందని..దీనిని పరిశీలించాలని ఎన్నికల ప్రధానాధికారికి సూచించారని సీఎస్ కార్యాలయం చెబుతోంది. దీని పైన ఎన్నికల సంఘం ఆధారాలను పరిశీలించి నిర్ణయం తీసుకుందని..ఇందులో ఎటువంటి వివక్ష లేదని స్పష్టం చేస్తున్నారు. ప్రతీ ఓటరు ఓటు వేసే విధంగా చూడాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంటుందని చెప్పారు. అధికారులు నిష్పక్ష పాతంగానే వ్యవహరిస్తారని స్పష్టం చేసారు.