యనమలకు షాక్: ఒక్కటైన ప్రత్యర్థులు, అసంతృప్తి?
తూర్పుగోదావరి జిల్లా టిడిపిలో సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడుకు ఆధిపత్యానికి పార్టీలో ప్రత్యర్థి వర్గం చెక్ పెడుతోంది. యనమల చెప్పినట్టుగానే గతంలో జిల్లాలో పార్టీ వ్యవహరాలు కొనసాగేవి.
కాకినాడ:తూర్పుగోదావరి జిల్లా టిడిపిలో సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడుకు ఆధిపత్యానికి పార్టీలో ప్రత్యర్థి వర్గం చెక్ పెడుతోంది. యనమల చెప్పినట్టుగానే గతంలో జిల్లాలో పార్టీ వ్యవహరాలు కొనసాగేవి. అయితే ఇటీవల కాలంలో మాత్రం అందుకు భిన్నంగా సాగుతున్నాయనే అభిప్రాయాలు పార్టీలో విన్పిస్తున్నాయి.యనమలకు చెక్ పెట్టేందుకు నారాలోకేష్ ద్వారా ప్రత్యర్థివర్గం పావులు కదుపుతోందనే ప్రచారం సాగుతోంది.
తూర్పుగోదావరి జిల్లాలో మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పిన మాట ప్రకారంగానే పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నడుచుకొంటారని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. అయితే ఇటీవల కాలంలో చోటుచేసుకొన్న పరిణామాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయనే అభిప్రాయాలను పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నాయి.
2019 ఎన్నికలకు టిడిపి నాయకత్వం ఇప్పటి నుండే వ్యూహరచన చేస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యర్థి పార్టీల నుండి బలమైన నేతలను తమ పార్టీలోకి ఆహ్వనిస్తోంది. ఈ తరుణంలోనే తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం యనమలకు చెక్ పెట్టేందుకు ఉన్న అవకాశాలను ప్రత్యర్థి వర్గం ఉపయోగించుకొంటోందని పార్టీలో ప్రచారం సాగుతోంది.
యనమలకు చెక్ పెడుతున్న ప్రత్యర్థి వర్గం
ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పిందే వేదంగా టిడిపి వ్యవహరాలు తూర్పుగోదావరి జిల్లాలో సాగేవి. అయితే ఈ జిల్లాలో ఇటీవల కాలంలో పరిస్థితులు మారాయనే అభిప్రాయం పార్టీవర్గాల్లో నెలకొంది. వైసీపీ నుండి ఇటీవల టిడిపిలో చేరిన జ్యోతుల నెహ్రుకు మంత్రిపదవి రాకుండా యనమల రామకృష్ణుడు అడ్డుకొన్నారనే ప్రచారం నెహ్రు వర్గీయుల్లో ఉంది. అయితే జ్యోతుల నెహ్రుకు మంత్రిపదవి వస్తోందని భావించినా చివరి నిమిషంలో ఆయనకు మాత్రం మంత్రి పదవి దక్కలేదు.దీని వెనుక యనమల ఉన్నారని జ్యోతుల నెహ్రు వర్గీయులు అనుమానిస్తున్నారనే ప్రచారం పార్టీలో బలంగా ఉంది.
Recommended Video
జడ్పి చైర్మెన్ పదవి జ్యోతుల కుటుంబానికి దక్కకుండా యత్నం
మంత్రిపదవి దక్కకపోవడంతో పాటు జడ్పి ఛైర్మెన్ పదవిని కూడ జ్యోతుల కుటుంబానికి దక్కకుండా యనమల రామకృష్ణుడు చివరిక్షణం వరకు ప్రయత్నాలు చేశారని జ్యోతుల వర్గీయుల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నట్టు పార్టీలో ప్రచారంలో ఉంది. అయితే పార్టీ అవసరాలరీత్యా జ్యోతుల కుటుంబానికి జడ్పి ఛైర్మెన్ పదవిని టిడిపి కట్టబెట్టింది. అప్పటివరకు జడ్పి ఛైర్మెన్గా ఉన్న వామన రాంబాబును రాజీనామా చేయించి మరీ జ్యోతుల నవీన్కు జిల్లా పరిషత్ ఛైర్మెన్ పదవిని కట్టబెట్టింది టిడిపి నాయకత్వం.
కాకినాడ మేయర్ విషయంలో కూడ యనమలకు చుక్కెదురు
కాకినాడ కార్పోరేషన్ పదవిని సుదీర్ఘ విరామం తర్వాత టిడిపి కైవసం చేసుకొంది. అయితే మేయర్ పదవికి అభ్యర్థి ఎంపిక విషయంలో కూడ యనమల రామకృష్ణుడుకు చుక్కెదురైందని ఆయన వర్గీయులు అభిప్రాయంతో ఉన్నారు. అధిష్టానం సీల్డ్ కవర్ రాజకీయంతో యనమలకు పెద్ద ఝలక్ ఇచ్చింది. ఎంపీ తోట నర్సింహం ఆధ్వర్యంలో యనమల ప్రత్యర్ధి నేతలంతా ఒక్కటై అధిష్టానం స్థాయిలో తమదే పైచేయి అనిపించుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
యనమలకు చెక్ పెట్టేందుకు ప్రత్యర్థులంతా ఏకతాటిపైకి
యనమల రామకృష్ణుడుకు చెక్ పెట్టేందుకు ప్రత్యర్థులంతా ఏకతాటిపైకి వచ్చారనే ప్రచారం పార్టీ వర్గాల్లో ఉంది.అయితే ఈ విషయమై యనమల రామకృష్ణుడుకు చెక్ పెట్టేందుకు ప్రత్యర్థులంతా సమన్వయంతో వ్యవహరిస్తున్నారనే ప్రచారం ఉంది. అయితే జిల్లా కలెక్టర్ నియామకంతో పాటు ఓ డిఎస్పి, అన్నవరం ఈఓ నియామకం విషయంలో కూడ యనమలకు వ్యతిరేకంగా ప్రత్యర్థులు పై చేయి సాధించారనే ప్రచారం పార్టీ వర్గాల్లో ఉంది. జిల్లాలో ఇటీవల చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో యనమల వర్గీయులు అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం సాగుతోంది.