పెయిడ్ ఆర్టిస్ట్ నటనా నైపుణ్యానికి రెమ్యునరేషన్ పెంచుకోవాలి ..పవన్ పై విజయసాయి వ్యంగ్యాస్త్రాలు
పవన్ కళ్యాణ్ పై వైసిపి నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని అమరావతి రైతుల దీక్షలకు మద్దతు తెలపటానికి రాజధాని వెళ్ళిన సమయంలో చోటు చేసుకున్న పరిస్థితులపై విజయసాయి సెటైర్లు వేశారు. తెలుగుదేశం పార్టీ చేతిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలుబొమ్మలా మారిపోయారని గతంలోనే విమర్శలు గుప్పించిన విజయసాయి పవన్ ను పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ పై తుళ్ళూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు !! .. రీజన్ ఇదే
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పవన్ కళ్యాణ్ ను టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ అని పేర్కొనటమే కాదు ఆయనలో నటనా నైపుణ్యాలు చాలా ఉన్నాయని ఎద్దేవా చేశారు. రెమ్యునరేషన్ పెంచుకోవాలని చురకలంటించారు.'పవన్ కళ్యాణ్ నటనా నైపుణ్యాలను చూసి నేను బాగా ఎంజాయ్ చేశాను. అమరావతి రైతుల ముందు ఈ పెయిడ్ ఆర్టిస్ట్ ప్రదర్శన తీరు చూశాక, టీడీపీ నాయకత్వం నుంచి ఆయన రెమ్యునరేషన్ ను మరింత పెంచుకునేందుకు అర్హుడని నేను భావించాను' అని విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ట్వీట్ చేశారు.
ఇక తన వ్యాఖ్యలతో మరోమారు టీడీపీ, జనసేనలు కలిసే రాజకీయాలు చేస్తున్నాయన్న భావన కలిగేలా ఆయన వ్యాఖ్యానించారు . ఏ మాత్రం చిన్న అవకాశం దొరికినా పవన్ ను మాత్రం విజయ సాయి టార్గెట్ చేస్తూనే ఉన్నారు. రాజధాని అమరావతి విషయంలో కూడా పవన్ పై పెద్ద ఎత్తున వైసీపీ మంత్రులు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఎవరు ఏం అన్నా పవన్ మాత్రం రాజధాని అమరావతి తమ పార్టీ స్టాండ్ అని చెప్పి అమరావతి తరలింపు వద్దు అంటూ రైతుల పక్షాన పోరాటం సాగిస్తున్నారు.