టీడీపీ పార్లమెంట్ పక్ష నేతగా గల్లా..! ప్రత్యేఖ హోదా వదిలేది లేదంటున్న జయదేవ్..!!
అమరావతి/హైదరాబాద్ : టీడీపీ పార్లమెంటరీ పక్ష నేతగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. లోక్సభలో పార్టీ నేతగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్నాయుడు, రాజ్యసభలో నేతగా ఎంపీ సుజనాచౌదరి వ్యవహరించనున్నారు. బుధవారం టీడీఎల్పీ సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు జగన్ ప్రమాణస్వీకారం నేపథ్యంలో గురువారం ముగ్గురు ఎమ్మెల్యేలతో కూడిన తెదేపా బృందం తాడేపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లనుంది.
తెదేపా తరఫున జగన్కు శుభాకాంక్షలు తెలిపేందుకు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, గంటా శ్రీనివాసరావు రేపు జగన్ ఇంటికి వెళ్లి కలవనున్నారు.ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తన ప్రమాణస్వీకారానికి హాజరు కావాలని వైసీపీ అధినేత జగన్ మాజీ సీఎం చంద్రబాబును కోరిన సంగతి తెలిసిందే.
ఇటీవల ఆయనకు ఫోన్ చేసిన జగన్ ప్రమాణస్వీకారానికి రావాలని కోరారు. మరోవైపు బుధవారం టీడీపీ నేతలు ఆయనను టీడీపీఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకాకూడదని నిర్ణయించుకున్నారు. తనకు బదులుగా ఇద్దరు టీడీపీ సీనియర్ నేతలతో కూడిన ప్రతినిధి బృందాన్ని పంపాలని నిర్ణయించారు.