బాబుతో మంత్రులు భేటీ: తిరుపతిలో 30న టిడిపి సభ
అమరావతి: ఈ నెల 30 తేదిల్లో తిరుపతిలో బహిరంగంగ సభ ఏర్పాటు చేయాలని టిడిపి నిర్ణయం తీసుకొంది. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై రాష్ట్రంలో చోటు చేసుకొన్నపరిణామాల నేపథ్యంలో చంద్రబాబునాయుడు ఈ నిర్ణయం తీసుకొన్నారు.
అమరావతిలో గురువారం నాడు అందుబాటులో ఉన్న మంత్రులతో, పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా విషయమై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. బిజెపి, వైసీపీ , జనసేన లెఫ్ట్ పార్టీలు రాష్ట్ర ప్రభుత్వంపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టే విషయమై చర్చించారు.
ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో సైకిల్ ర్యాలీలు నిర్వహించాలని టిడిపి నిర్ణయం తీసుకొంది. సైకిల్ ర్యాలీలను విజయవంతంగా చేసేందుకు అవలంభించాల్సిన వ్యూహంపై చర్చించారు.
మరోవైపు ఏప్రిల్ 20వ తేదిన దళిత తేజం ముగింపు సందర్భంగా సభను నిర్వహించాలని టిడిపి నిర్ణయించింది. మరో వైపు ప్రత్యేక హోదాపై రాష్ట్రానికి కేంద్రం ఏ రకంగా అన్యాయం చేసిందనే విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాలనే విషయమై చర్చించారు. ఏప్రిల్ 30న తిరుపతిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని టిడిపి నిర్ణయం తీసుకొంది.
ప్రత్యేక హోదాపై ఎంపీలతో బస్సు యాత్ర చేయాలని టిడిపి ఇప్పటికే నిర్ణయం తీసుకొంది. ఆత్మగౌరవయాత్ర పేరుతో టిడిపి ఎంపీలు బస్సు యాత్రను నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ బస్సు యాత్ర సాగనుంది.
ఈ బస్సు యాత్రలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కూడ మూడు చోట్ల పాల్గొనే అవకాశం ఉంది. అయితే బస్సు యాత్ర ఎప్పటి నుండి అనే విషయమై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.