జగన్ ఉంటే ప్రభుత్వం పడిపోయేది: మోడీకి బాబు షాక్, మళ్లీ అవిశ్వాసం
Recommended Video
అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మరోసారి షాకివ్వనున్నారా? అంటే అవుననే అంటున్నారు. కేంద్ర ప్రభుత్వంపై మళ్లీ అవిస్వాస తీర్మానం పెట్టాలని తెలుగుదేశం పార్టీ నేతలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశనం చేశారు. గురువారం ఆయన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడారు.
జనసేన వచ్చిందిగా!: మైసూరా ఆసక్తికరం, ప్రత్యేక సీమపై షాకింగ్ కామెంట్స్
బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంపై మళ్లీ అవిశ్వాసం పెట్టాలని, అలాగే, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేయాలన్నారు. లోకసభలో ప్రస్తుతం బీజేపీ బలం తగ్గిపోయిందని చెప్పారు. మిత్రపక్షాల కారణంగా బీజేపీకి ఆధిక్యత ఉందన్నారు.
వైసీపీ నమ్మకద్రోహం
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికకు సంబంధించి బీజేపీ ఎవరిని నిలబెట్టినా వారికి వ్యతిరేకంగా ఓటు వేయాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. ప్రస్తుతం బీజేపీకి ఒంటరిగా బలం లేనందున, ఇలాంటి సమయంలో పార్లమెంటు వేదికగా గట్టిగా పోరాడాల్సి ఉందన్నారు. ఏపీ ప్రయోజనాల కోసం పార్లమెంటు వేదికగా పోరాడాల్సిన సమయంలో వైసీపీ పారిపోయిందని, తద్వారా రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేసిందన్నారు.
వైసీపీ వస్తే ప్రభుత్వం పడిపోయేది
వారు ఎంపీలుగా కొనసాగి, రానున్న లోకసభ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం ద్వారా కేంద్రానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే ప్రభుత్వం పడిపోయేదని చంద్రబాబు అన్నారు. రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై వారితో చర్చించారు. మనం అవిశ్వాసం పెడితే 50 మంది సభ్యుల మద్దతుకు డోకా లేదని, ప్రతిపక్షాల మద్దతు కోరాలన్నారు.
నేనూ ఫోన్లు చేస్తా, సంఘీభావం తెలపాలని అడుగుతా
కాంగ్రెస్సేతర, బీజేపీయేతర పార్టీల అధ్యక్షులను, ముఖ్య నాయకులను కలిసి మద్దతు కోరాలని చంద్రబాబు సూచించారు. ఏపీకి జరిగిన అన్యాయంపై పార్లమెంటు వేదికగా పోరాడేందుకు సహకరిచాలని కోరాలని చెప్పారు. నేను కూడా ప్రతిపక్షాల నేతలకు ఫోన్లు చేసి ఏపీకి జరిగిన అన్యాయంపై మనం చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలపమని కోరుతానని చెప్పారు.
అందరి దృష్టి మనపైనే
రాబోయేది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అని, అందులో మనకు పెద్దగా ప్రయోజనమేమీ ఉండదని, అందుకే గట్టిగా పోరాడాలని చంద్రబాబు సూచించారు. ఏపీలోని ఐదు కోట్ల ప్రజల దృష్టి మనపైనే ఉందని, అందుకు తగినట్లుగా మనం పార్లమెంటులో వ్యవహరించాలని, గత సమావేశాల కంటే గట్టిగా పోరాడాలని, బీజేపీ ఏపీకి చేసిన ద్రోహాన్ని సభ సాక్షిగా నిలదీయాలన్నారు.
ముందే చెప్పిన గల్లా జయదేవ్
మోడీ ప్రభుత్వంపై లోకసభలో మరోసారి అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇస్తామని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ మూడు రోజుల క్రితం అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వచ్చే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనూ తమ ఆందోళన యథావిధిగా కొనసాగుతుందన్నారు. టీడీపీ పొలిట్బ్యూరో సభ్యురాలిగా నియమితులైన గల్లా అరుణ కుమారికి, పార్లమెంటులో తన వాగ్ధాటితో మెప్పించిన జయదేవ్కు మంగళవారం అభినందన కార్యక్రమం జరిగింది. ఆ సమయంలో గల్లా మాట్లాడారు.