జగన్ అక్కడే సక్సెస్ అయ్యారు : మాజీ మంత్రి అయ్యన్న కన్నీరు: టీడీపీలో పాలిట్ బ్యూరోలో కీలక నిర్ణయాలు.
తెలుగుదేశ్ పార్టీ పాలిట్ బ్యూరో సమావేశంలో అసక్తి కర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత తొలి సారి టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశమైంది. ఈ సమావేశంలో ఎన్నికల ఫలితాల పైన పోస్ట్ మార్టం చేసారు. సామాజిక సమీకరణాలు...డబ్బు ఖర్చులో వైసీపీ పక్కాగా అడుగులు వేసిందని ..అక్కడే జగన్ సక్సెస్ అయ్యారని పాలిట్ బ్యూరోలో పలువురు సభ్యులు అభిప్రాయపడ్డారు. అదే విధంగా పార్టీ ఓటమి..అన్నా క్యాంటీన్ల మూసివేత పైన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సమావేశంలో పదేపదే కన్నీరు పెట్టుకున్నారు. పార్టీతో పాటుగా పార్టీ పాలిట్ బ్యూరోను ప్రక్షాళన చేయాలని మరి కొందరు నేతలు అధినేతకు సూచించారు. ప్రభుత్వం పార్టీ కార్యకర్తల మీద దాడులు చేయిస్తోందని..దీని పైన సమిష్టిగా ముందుకు వెళ్లాలని సమావేశం తీర్మానించింది.
పాలిట్ బ్యూరోలో అయ్యన్న కన్నీరు..
తెలుగు దేశం పార్టీ ఎన్నికల ఫలితాల మీద పాలిట్ బ్యూరోలో సమీక్ష చేసారు. ఎన్నికల్లో అపజయం, ఓటింగ్ సరళిపై నేతలు విస్తృతంగా చర్చించారు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఈ సమావేశంలో పలు మార్లు కన్నీరు పెట్టుకొని పలు వ్యాఖ్యలు చేసారు. టీడీపీ హయాంలో చేసిన పనులు, కష్టపడిన తీరును ఈ సందర్భంగా అయ్యన్న గుర్తుచేశారు. ఇంత చేసినా ప్రజలు వైసీపీ వైపు మొగ్గారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్న క్యాంటీన్ల మూసివేతతో అందరు బాధపడుతున్నారని మరోసారి కంటతడి పెట్టుకున్నారు. అదే సమయంలో పార్టీతో పాటుగా పాలిట్ బ్యూరోను ప్రక్షళన చేయాలని సీనియర్ నేత సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి సూచించారు. పార్టీని క్షేత్ర స్థాయి నుండి కొత్త కమిటీలతో దిద్దుబాటు చేయాలని నేతలు అభిప్రాయపడ్డారు. గత ఐదేళ్లలో చంద్రబాబు పడిన కష్టాన్ని సోమిరెడ్డి గుర్తుచేసుకున్నారు. సోమిరెడ్డి యువకుడిలా ఉత్సాహంగా ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశంసించారు.
జగన్ అక్కడే సక్సెస్ అయ్యారు..
ఎన్నికల్లో వైసీపీలా డబ్బు ఖర్చు చేయలేకపోయామని పాలిట్ బ్యూరోలో కొందరు సభ్యులు అభిప్రాయపడ్డారు. సామాజిక సమీకరణలో విఫలమయ్యామని మరికొందరు సభ్యులు పేర్కొన్నారు. అభివృద్ధి, భవిష్యత్పై దృష్టిపెట్టి సామాజిక సమీకరణ విస్మరించామని నేతలు చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో కొందరు నేతలు ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఓడారని, మరికొందరు సరిగా పనిచేయకపోవడం వల్ల ఓడారని నేతలు తమతమ అభిప్రాయాలను సమావేశంలో వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత జగన్ ఇదే అనుకూలంగా మలచుకున్నారని అభిప్రాయం వ్యక్తం అయింది. ఎన్నికల్లో సీట్ల కేటాయింపు విషయంలో.. డబ్బు ఖర్చు చేసే విషయంలో వైసీపీ చేసినంత ప్లానింగ్ చేయలేకపోయారనే అభిప్రాయం పార్టీ సీనియర్లు వ్యక్తం చేసారు. అధికారంలో వచ్చే ముందు వైసీపీ ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతోందని.. రెండు నెలల కాలం లోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైందని నేతలు చెప్పుకొచ్చారు. ఇసుక కొరత, అన్నా క్యాంటీన్ల మూసివేత, పోలవరం..రాజధాని పైన అవగాహన..అనుభవం లేని నిర్ణయాలతో ప్రజల్లో వ్యతిరేకత మూట గట్టుకున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు సమాచారం.
కార్యకర్తలకు అండగా నిలవాలి..
పాలిట్ బ్యూరోలో టీడీపీ కార్యకర్తల పైన దాడులు జరుగుతున్నాయని..దీని పైన సమిష్టిగా పోరాటం చేయాలని తీర్మానించారు. అన్నారు. టీడీపీ కార్యకర్తలపై దాడులపై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఏడుగురు టీడీపీ కార్యకర్తలను హత్య చేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇప్పటికే కార్యకర్తలకు అండగా ఉంటామనే సంకేతాలు ఇచ్చామని..త్వరలోనే పార్లమెంటరీ స్థాయిలో పార్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లాల్లో పర్యటనలు చేయాలని..కార్యకర్తలతో మమేకం కావాలని పార్టీ అధినేత ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కేడర్ ను సమాయత్తం చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యాచరణ అమలు చేయాలని నిర్ణయించారు.