టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ప్రారంభం : మున్సిపల్ ఎన్నికలపై ప్రధాన చర్చ
ఏపీ టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో జిల్లాలలో పార్టీ పరిస్థితి ఏవిధంగా ఉంది. పార్టీని బలోపేతం చేయడానికి ఏ విధమైన చర్యలు చేపట్టాలి. టిడిపి నేతలపై వైసీపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఏవిధంగా తిప్పికొట్టాలనే అనేక అంశాలు చర్చకు రానున్నాయి.
ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో కీలకమైన అంశాలపై చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో ఈరోజు మధ్యాహ్నం సమావేశమైంది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో కొనసాగుతున్న సమావేశంలో సంస్థాగత ఎన్నికలకు సమాయత్తం కావడంతో పాటుగా, పార్టీ కమిటీల ఏర్పాటు తదితర 13 అంశాలతో ఎంజెండా రూపొందించి వాటిపై చర్చించాలని నిర్ణయించారు.
ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసిపి ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం హయాంలో అమలైన పథకాలను నిలిపివేత, టీడీపీ నేతలపై అక్రమ కేసుల అంశాలపైనా పొలిట్ బ్యూరో సభ్యులు సీరియస్ గా చర్చించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఎలా సంసిద్ధం కావాలన్న అంశంపై చర్చించి పార్టీ కేడర్కు దిశానిర్దేశం చేసే దిశగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోనున్నారు. ఎలాగైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పోయిన ప్రాభవాన్ని తిరిగి దక్కించుకోవాలని నిర్ణయం తీసుకున్న చంద్రబాబు అందులో భాగంగానే జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.