ప్రజా తీర్పును తప్పుపడుతూ టీడీపీ పోస్టర్లు .. సెల్ఫ్ గోల్ వేసుకుంటున్న టీడీపీ
ఏపీలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయంపై ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన టీడీపీ నేతలు ప్రజా తీర్పును తప్పు పడుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధిని కోల్పోయింది అంటూ బ్యానర్లు పెట్టి సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారు. ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా ఎన్నికల్లో ఓటమికి కారణం అన్వేషించాల్సిన టీడీపీ నాయకులు ప్రజా నిర్ణయం తప్పన్నట్టు బ్యానర్లు పెట్టటం పార్టీని మరింత సంక్షోభంలోకి నేట్టేలా ఉంది.
అభివృద్ధిని కోల్పోయిన ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు అని బ్యానర్ పెట్టిన టీడీపీ నాయకులు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 23 స్థానాలకు పరిమితం కావడంపై టీడీపీ నేతలు ఆవేదనలో ఉన్నారు. కానీ ఎందుకిలా జరిగింది. లోపం ఎక్కడ ఉంది ? పార్టీలో చేసిన తప్పులేంటి ? వంటి అంశాలపై పోస్ట్ మార్టం పక్కన పెట్టి తమ అసహనాన్ని బ్యానర్ల రూపంలో చూపిస్తున్నారు టీడీపీ నాయకులు. తాజాగా దిండి గ్రామంలోని టీడీపీ నాయకులు పెట్టిన ఒక పోస్టర్ ప్రస్తుతం హాట్ హాట్ చర్చకు కారణం అవుతుంది. ఏపీలో ప్రజలు టీడీపీని గెలిపించకపోవటం అభివృద్ధి నిరోధకం అన్నట్టు 'అభివృద్ధిని కోల్పోయిన ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు' అని బ్యానర్ పెట్టారు. ఈ బ్యానర్ ను బట్టి ఏపీ ప్రజలు తీసుకున్న నిర్ణయం తప్పని, చంద్రబాబు తప్ప ఇంకెవరు వచ్చినా ఏపీలో అభివృద్ధి జరగదని టీడీపీ నాయకులు చెప్తున్నట్టు వుంది. ఇది ప్రజా స్వామ్యంలో ప్రజల తీర్పును తప్పు పట్టేలా ఉన్న స్టేట్ మెంట్ . ఈ స్టేట్ మెంట్ ప్రజల్లో టీడీపీ పట్ల విముఖతకు మరింత కారణం అయ్యే అవకాశం లేకపోలేదు.
ప్రజా తీర్పును తప్పు పడుతున్న టీడీపీ ... జగన్ కు పట్టం కట్టటం తప్పన్నట్టు టీడీపీ పోస్టర్లు
ఏపీ సీఎంగా ఏపీ ప్రజలు జగన్ కు పట్టం కట్టారు . అనూహ్యమైన మెజార్టీ ఇచ్చారు. 151 స్థానాల్లో గెలిపించారు. స్పష్టమైన మెజార్టీతో అధికారం అందించారు. ఇక అధికారం చేపాట్టి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి . సీఎంగా బాధ్యతలు చేప్పట్టి పట్టుమని నాలుగు రోజులైనా కాలేదు . అయినప్పటికీ ఏపీ పాలనలో తన మార్క్ చూపించటానికి జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చకు కారణం అవుతుంది. ఆర్ధిక లోటు ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడపటానికి సీఎంగా తన వంతు పాత్ర పోషిస్తానని కేవలం ఒక రూపాయి తీసుకుని పని చేస్తానని చెప్పారు. కనీసం జగన్ తన పాలన ఏ విధంగా చేస్తారో చూడాలంటే ఒక్క సంవత్సరం సమయం అయినా ఇవ్వాలి. అలా కాకుండా టీడీపీ నేతలు మాటలతో, ప్రజా తీర్పును తప్పు పట్టే పోస్టర్ లతో దాడికి దిగితే అది కచ్చితంగా టీడీపీ కే నష్టం అవుతుందని రాజకీయ విశ్లేషకుల భావన .
సెల్ఫ్ గోల్ వేసుకుంటున్న టీడీపీ ... టీడీపీ శ్రేణులను కట్టడి చెయ్యటం అధిష్టానానికి అవసరం
టీడీపీ నాయకులు అసహనంతో ప్రవర్తిస్తున్న తీరు, పెడుతున్న పోస్టర్లు, చేస్తున్న వ్యాఖ్యలపై అధినాయకత్వం దృష్టి సారించాలి.లేకుంటే ఇప్పటికీ పీకల్లోతు చిక్కుల్లో ఉన్న టీడీపీ మరోమారు సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు అవుతుంది. పార్టీ మరింత దెబ్బ తింటుంది. ప్రజా క్షేత్రంలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుంది. వైఎస్ జగన్ ను టార్గెట్ చేసే విషయం అటుంచితే ప్రజలను అవమానించినట్టు, ప్రజా నిర్ణయాన్ని అపహాస్యం చేసినట్టు మాట్లాడితే దాని పర్యవసానం 2024లోనూ ఉండే ప్రమాదం వుంది. ఇప్పటికైనా టీడీపీ పార్టీని కాపాడుకోవటమే కాహు, పార్టీ శ్రేనులపై చర్యలపై కూడా ఓ లుక్ వెయ్యాల్సి వుంది. పార్టీని కట్టడ చెయ్యాల్సి వుంది. లేకుంటే నష్టం మాత్రం టీడీపీ కే .