లక్ష్మీస్ ఎన్టీఆర్: టీడీపీ ఓటమికి ఓ చెయ్యేసిందా? ఓటమిపై పోస్ట్మార్టమ్!
అమరావతి: కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు ఉన్నట్టు.. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యంత ఘోరంగా ఓడిపోవడానికి అనేక పరిణామాలు, సంఘటనలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో వ్యవహరించిన తీరు, ప్రచార శైలి, బహిరంగ సభల్లో వినియోగించిన భాష, రాజకీయ ప్రత్యర్థిపై వ్యక్తిగత దాడులకు దిగడం, వ్యక్తిత్వాన్ని కించపరచడం వంటి కారణాలు చాలానే ఉన్నాయి. వాటన్నింటితో పాటు- రామ్ గోపాల్ వర్మ కూడా ఓ చెయ్యి వేశారనే అనుకోవచ్చు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ద్వారా.
చరిత్రలో తొలిసారి: పొత్తు లేకుండా పోటీ చేసిన చంద్రబాబు టీడీపీ: ఘోర పరాజయం
ఈ సినిమా కథాంశమే సంచలనం అనుకుంటే.. విడుదల కూడా అంతే సంచలనాన్ని రేపింది. హైకోర్టు గడప తొక్కింది. విడుదలకు నోచుకోలేదు. సినిమా విడుదల తేదీ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఇలా వాయిదాలు పడటం, సరిగ్గా ఎన్నికల ముంగింట్లో.. మన రాష్ట్రంలో మినహా ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలైంది. విడుదలైన సాయంత్రానికి కొన్ని వెబ్సైట్ల ద్వారా ప్రేక్షకుల స్మార్ట్ఫోన్లకు వచ్చి చేరిందా మూవీ. ఏపీలో మినహాయిస్తే- తెలంగాణ సహా పొరుగు రాష్ట్రాలన్నింట్లోనూ విడుదలైన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను దాదాపు తెలుగువాళ్లందరూ చూసేశారు. ఈ సినిమాలో మెయిన్ విలన్ చంద్రబాబు క్యారెక్టరే కావడం ప్రేక్షకులను ఆలోచింపజేసి ఉండొచ్చు.
1994 నాటి వైస్రాయ్ ఉదంతం గురించి బొత్తిగా అవగాహన లేని కొత్తతరం ప్రేక్షకులు, యువతరం ఓటర్లపై లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రభావం చూపించి ఉండొచ్చు అని నిర్దారించడానికి సాంకేతికంగా ఎలాంటి కారణాలు లేవు. అయినప్పటికీ- తాజా ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే యువత ఓట్లు టీడీపీకి పడలేదనే అనుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వల్ల పార్టీలో చేరిన చంద్రబాబు ఎలా పార్టీని హస్తగతం చేసుకున్నారనే విషయాన్ని లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో చూపించారు.
తెలుగువారి ఆత్మగౌరవాన్ని కారణంగా చూపుతూ, తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి, కేంద్రాన్ని శాసించగల స్థాయిలో ఉండి కూడా తన అల్లుడి వల్ల ఎన్టీ రామారావు చివరిరోజుల్లో ఎలాంటి మానసిక క్షోభను అనుభవించారనే అంశం చుట్టూ సినిమా నడుస్తుంది. కీలకమైన ఎన్టీ రామారావు, లక్ష్మీపార్వతి, చంద్రబాబు నాయుడి పాత్రలకు నటీనటులు కూడా అతికి నట్టు సరిపోయారు. ఇవన్నీ ప్రభావం చూపించే ఉంటాయని భావిస్తున్నారు పార్టీ నాయకులు.
చంద్రబాబు అంటే కొద్దో, గొప్పో అభిమానం ఉన్న యువతరం ఈ సినిమా ప్రభావం చూపించి ఉంటుందని అనుమానిస్తున్నారు. సినిమా విడుదల విషయంలో రచ్చ చేయకపోయి ఉంటే బాగుండేదని భావిస్తున్నారు. నిర్ణీత తేదీకి మూవీ విడుదలై ఉంటే దాని వేడి రెండు, మూడు రోజుల్లో చల్లారిపోయి ఉండేదని చెబుతున్నారు. హైకోర్టు ద్వారా సినిమాను అడ్డుకోవడం, విడుదల తేదీని వాయిదా వేయించడం వంటి కారణాల వల్ల ప్రేక్షుకుల్లో అందులో ఏముందో అనే కుతూహలం తలెత్తిందని, టికెట్ కొని, థియేటర్కు వెళ్లనప్పటికీ.. స్మార్ట్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుని చూసి ఉంటారని అంటున్నారు. అది ఓ రకంగా పార్టీకి మైనస్ పాయింట్గానే మారిందని వాపోతున్నారు టీడీపీ నాయకులు.