టీడీపీ ప్రజా చైతన్య యాత్ర... చంద్రబాబు భద్రతపై ఆసక్తికర చర్చ
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి వైసీపీ 9నెలల పాలనపై ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పనున్నారు. సీఎంగా జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికారం చేపట్టిన తొమ్మిది నెలల కాలంలో వైసీపీ పరిపాలనలో ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి అని భావిస్తున్నమాజీ సీఎం చంద్రబాబు నేటి నుండి సమర శంఖం పూరిస్తున్నారు. 45 రోజుల పాటు వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా క్షేత్రంలో ఎండగట్టటానికి తీసుకున్న నిర్ణయం మేరకు ఆయన రంగంలోకి దిగి 9నెలల పాలనలో 9 రద్దులు, మోసాలు, భారాలను ప్రజలకు చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు .
రేపటి నుండే టీడీపీ ప్రజా చైతన్య యాత్ర ... కాన్సెప్ట్ అంతా తొమ్మిదే !!
టీడీపీ ప్రజా చైతన్య యాత్ర ప్రారంభిస్తున్న చంద్రబాబు
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ఉన్న పరిస్థితులను, ఏపీ వెనుకబడుతున్న తీరును ప్రజలకు అర్ధం అయ్యేలా చెప్పాలని ప్రజా చైతన్య యాత్ర నిర్వహించనుంది టీడీపీ . ఇక ఈ షెడ్యూల్ చూస్తే నేడు ప్రకాశం జిల్లా నుండి ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించనున్న చంద్రబాబు మార్టూరు, మేదరమెట్ల, ఒంగోలులలో ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నుంచి బయలుదేరి 11 గంటలకు బొప్పూడి చేరుకుంటారు.
షెడ్యూల్ ఇలా
11 గంటలకు బొప్పూడి ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేస్తారు.అనంతరం 11.30 గంటలకు బస్సు యాత్ర ప్రారంభిస్తారు.ఇక చంద్రబాబు 12.30 గంటలకు మార్టూరు బహిరంగ సభలో ప్రసంగిస్తారు.12.50 గంటలకు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు క్యాంపు కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తారు. ఆ తర్వాత 2.20 గంటలకు మేదరమెట్ల బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. ఇక 6 గంటలకు ఒంగోలు అద్దంకి బస్టాండ్ సెంటర్లో ప్రసంగిస్తారు...తిరిగి రాత్రి 8గంటలకు టీడీపీ నాయకులతో సమావేశం నిర్వహించి రాత్రి 10 గంటలకు ఉండవల్లి నివాసానికి తిరుగు పయనం అవుతారు .
చంద్రబాబు భద్రతపై సర్వత్రా చర్చ
ప్రకాశం జిల్లాలో ప్రజాచైతన్య యాత్ర కోసం టీడీపీ సన్నాహాలు చేసింది. అయినా చంద్రబాబు భద్రత విషయంలో ఆందోళన నెలకొంది. చంద్రబాబు భద్రత విషయంలో ఆయనకు ఏపీ సర్కార్ భద్రత తగ్గించాలని నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సెక్యూరిటీ రివ్యూ కమిటీ నిర్ణయం మేరకు భద్రతలో మార్పులు, చేర్పులు చేస్తామని అధికార యంత్రాంగం వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపధ్యంలో చంద్రబాబు పర్యటన చేస్తున్న వేళ ఆయన భద్రత అంశం ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది.
Recommended Video
చంద్రబాబుకు హై సెక్యూరిటీ ఇస్తున్నామన్న ఏపీ పోలీసులు
ఇక ఏపీ పోలీసు ఉన్నతాధికారులు చంద్ర బాబు నాయుడు భద్రతలో ఎలాంటి మార్పులు జరగలేదని ప్రకటించారు. దేశంలోనే అత్యంత హై సెక్యూరిటీని ఆయనకు ఇస్తున్నామని , ప్రస్తుతం Z+ సెక్యూరిటీ ఆయనకు ఉందని చెప్పారు .ప్రస్తుతం చంద్రబాబుకు 83 మందితో భద్రత కల్పిస్తున్నామని, విజయవాడలో 135 మంది హైదరాబాద్లో 48 మందితో భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. ఈ భద్రత ప్రజా చైతన్య యాత్రలో కూడా కొనసాగిస్తామని క్లారిటీ ఇచ్చారు.