Nara Bhuvaneswari: నందమూరి వారసురాలిగా ..నారా ఇంటి కోడలిగా: టీడీపీలో క్రియాశీలకంగా భువనేశ్వరి?
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా? పార్టీలో ఆమె క్రియాశీలక పాత్రను పోషించనున్నారా? నందమూరి కుటుంబ వారసురాలిగా ఆమె పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. రాజధాని అమరావతి ప్రాంతంలో భువనేశ్వరి నిర్వహించిన పర్యటన విజయవంతమైందనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమౌతోంది.
రైతులకు బాసటగా..
రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ కొద్దిరోజులుగా అమరావతి ప్రాంతంలో ప్రదర్శనలు, ఆందోళనలను చేపట్టిన రైతులకు నారా భువనేశ్వరి బాసటగా నిలిచారు. దీనికోసం ఆమె కొద్దిరోజుల కిందటే అమరావతి ప్రాంతంలో పర్యటించారు. రైతులతో ముఖాముఖిని నిర్వహించారు. వారి ఆవేదనను స్వయంగా పరిశీలించారు. రైతుల సంక్షేమం కోసం తన ప్లాటిన్ గాజును దానం ఇచ్చారు.
పార్టీలో జోష్..
నారా భువనేశ్వరి పర్యటన విజయవంతమైందనే అభిప్రాయం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమౌతోంది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వారసురాలిగా, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి భార్యగా ఆమె క్రియాశీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయనే విషయం చర్చనీయాంశమైంది. అమరావతి పర్యటన సందర్భంగా భువనేశ్వరి పర్యటనకు అనూహ్య స్పందన లభించిందని, దీన్ని పార్టీ కోసం పూర్తిస్థాయిలో వినియోగించుకుంటే బాగుంటుందని అంటున్నారు నాయకులు.
నందమూరి కుటుంబాన్ని ఏకం చేసే సత్తా..
ప్రస్తుతం నందమూరి కుటుంబం తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా లేదు. రాజ్యసభ మాజీ సభ్యుడు, దివంగత హరికృష్ణ మరణం తరువాత.. ఆ స్థానాన్ని నందమూరి కుటుంబం నుంచి భర్తీ చేసే వారే లేరు. హరికృష్ణ కుమారుడు, నటుడు జూనియర్ ఎన్టీఆర్.. పార్టీకి పూర్తిగా దూరం అయ్యారు. బాలకృష్ణ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పటికీ.. ఆయన హిందూపురాన్ని దాటి బయటికి రావట్లేదు. అసెంబ్లీ సమావేశాల సమయంలోనూ ఆయన షూటింగులకే పరిమితం అయ్యారు. పురంధేశ్వరి భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు. తారకరత్నకు ఆ ఛరిష్మా లేదనే అభిప్రాయాలు పార్టీలో వ్యక్తమౌతున్నాయి.
హరికృష్ణ స్థానాన్ని భర్తీ చేసేలా..
ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో ఖాళీగా ఉన్న హరికృష్ణ స్థానాన్ని భువనేశ్వరితో భర్తీ చేయాలనే అభిప్రాయాలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. ప్రత్యక్ష రాజకీయాల్లో భువనేశ్వరి రాణించగలరని విషయాన్ని రైతులతో ఆమె సంభాషించిన తీరు, పరిస్థితులకు అనుగుణంగా స్పందించడం, అప్పటికప్పుడు తన ప్లాటినం గాజును దానంగా ఇవ్వడం వంటి సందర్భాలు.. భువనేశ్వరిలోని రాజకీయ పరిపక్వతను సూచిస్తున్నారని చెబుతున్నారు నాయకులు.
వైసీపీ దూకుడుకు కారణం అదే..
భువనేశ్వరి పర్యటన ముగిసిన కొద్దిసేపటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు. హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత.. స్పందించడం అధికార పార్టీ దూకుడును స్పష్టం చేస్తోంది. అధికార పార్టీ రాజకీయంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోందనే సంకేతాన్ని పంపించినట్టయింది. భువనేశ్వరిని తెర మీదికి తీసుకుని వచ్చి, నందమూరి వారసురాలిగా ప్రజలకు పరిచయం చేస్తే.. మహిళల సానుభూతి అనే అంశం వర్కవుట్ అవుతుందనే వాదన టీడీపీలో బలంగా వినిపిస్తోంది.