చంద్రబాబు విశాఖ పర్యటన రద్దు: డీజీపీ అనుమతి ఇచ్చినా: జగన్ కుట్ర: భగ్గుమంటోన్న టీడీపీ
విశాఖపట్నం: తెలుగు దేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు విశాఖపట్నం పర్యటన వాయిదా పడినట్టే కనిపిస్తోంది. రెండు నెలల తరువాత సొంత రాష్ట్రానికి రావడానికి ఆయన పూర్తి ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ.. చివరి నిమిషంలో ఊహించని విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల చంద్రబాబు విశాఖ పర్యటన రద్దయింది. రోడ్డు మార్గం గుండా చంద్రబాబు, మాజీ మంత్రి నారా లోకేష్ అమరావతికి చేరుకోనున్నారు. విశాఖపట్నం పర్యటన మాత్రం మరో రోజు షెడ్యూల్ చేయవచ్చని తెలుస్తోంది. మహానాడు తరువాత విశాఖ పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
చంద్రబాబు విశాఖ పర్యటనపై ఉత్కంఠకు తెర: 25న ఉదయానికి ఏపీలోకి ఎంట్రీ
షెడ్యూల్ ఇదీ..
ప్రస్తుతం చంద్రబాబు హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన సొంత నివాసంలో నివసిస్తున్నారు. ఏపీకి రావడానికి అనుమతి ఇవ్వాలంటూ ఆయన డీజీపీకి లేఖ రాశారు. చంద్రబాబు, ఆయన కుమారుడు మాజీమంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో పర్యటించడానికి ఆదివారం మధ్యాహ్నమే డీజీపీ గౌతమ్ సవాంగ్ అనుమతి ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారం.. ఈ ఉదయం 10:30 గంటలకు చంద్రబాబు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరి మధ్యాహ్నానికి విశాఖపట్నానికి చేరుకోవాల్సి ఉంది. ఎల్జీ పాలిమర్స్ మృతుల కుటుంబాలు, బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన రోడ్డు మార్గంలో గుంటూరు జిల్లా ఉండవల్లిలో తన నివాసానికి చేరుకోవాల్సి ఉంది.
విశాఖకు వెళ్లలేకపోవడానికి..
ఏపీలో విమాన సర్వీసుల పునరుద్ధరణను వాయిదా వేసింది కేంద్ర ప్రభుత్వం. దేశం మొత్తం సోమవారం నుంచే డొమెస్టివ్ విమాన సర్వీసులు ఆరంభం కాబోతున్నప్పటికీ.. ఏపీ, పశ్చిమ బెంగాల్లల్లో మంగళవారం ఆరంభమౌతాయి. ఈ మేరకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. ఏపీలో విమాన సర్వీసులు పునరుద్ధరణ, విమానాశ్రయాల కార్యకలాపాలు మంగళవారం నుంచి ప్రారంభమౌతాయని పేర్కొంది. కేంద్రం చివరి నిమిషంలో తీసుకున్న అనూహ్య నిర్ణయం వల్ల చంద్రబాబు విశాఖ పర్యటన రద్దు అయింది.
రోడ్డు మార్గంలో అమరావతికి..
విమాన సర్వీసులు వాయిదా పడటం వల్ల చంద్రబాబు, నారా లోకేష్ రోడ్డు మార్గంలో అమరావతికి చేరుకోవచ్చని తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ ధృవీకరించింది. చంద్రబాబు సోమవారం హైదరాబాద్ నుంచి బయలుదేరి నేరుగా అమరావతికి చేరుకుంటారని వెల్లడించింది. దీనితో ఆయన విశాఖపట్నం పర్యటన దాదాపుగా రద్దయినట్టే. చంద్రబాబు మరో రోజు విశాఖకు వెళ్తారా? లేక మొత్తానికే రద్దు చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. బుధ, గురువారాల్లో అమరావతి నుంచే జూమ్ యాప్ ద్వారా మహానాడు కార్యక్రమాలను నిర్వహిస్తామని, ఇందులో మార్పు ఉండదని అంటున్నారు.
Recommended Video
జగన్ కుట్రే అంటోన్న టీడీపీ
ఏపీలో మంగళవారం నుంచి విమాన సర్వీసులను పునరుద్ధరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక మతలబు ఉందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నారని టీడీపీ సభా పక్ష ఉప నాయకుడు, మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. చంద్రబాబు ఎప్పుడు విశాఖకు వచ్చినా ప్రభుత్వం అడ్డుకుంటోందని, దీనిపై దర్యాప్తు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు పర్యటనకు డీజీపీ అనుమతి ఇచ్చిన తరువాతే.. కేంద్ర ప్రభుత్వం ఏపీలో విమాన సర్వీసుల పునరుద్ధరణకు ఒకరోజు పాటు వాయిదా వేసిందని అన్నారు. జగన్ కుట్ర పన్నారనడానికి ఇదే నిదర్శనమని చెప్పారు.