ఏపీకి రానున్న చంద్రబాబు: ఎప్పుడంటే: మొదట్లో కేంద్రానికి..ఇప్పుడు డీజీపీకి: ఓకే అంటేనే
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నివాసాన్ని విడబోతున్నారు. ఏపీకి బయలుదేరి రానున్నారు. సొంత రాష్ట్రానికి రావడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆయన రాష్ట్రా పోలీస్ డైరెక్టర్ జనరల్కు లేఖ రాశారు. చంద్రబాబు రాసిన లేఖపై డీజీపీ కార్యాలయం సూచనప్రాయంగా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ఆదేశాలు ఇంకా జారీ కావాల్సి ఉంది. ఆయన ఏపీకి వస్తారా? లేదా? అనే అంశంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మహానాడు తరువాత ఏపీకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వైసీపీ ఏడాది పాలనపై టీడీపీ, బీజేపీ నేతల విసుర్లు .. ఎవరేమన్నారంటే
రెండు నెలల తరువాత..
చంద్రబాబు ప్రస్తుతం హైదరాబాద్ జూబ్లీహిల్స్లో గల తన సొంత నివాసంలో ఉంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందక ముందే ఆయన తన కుమారుడు నారా లోకేష్తో కలిసి వేర్వేరు వాహనాల్లో రోడ్డు మార్గంలో హైదరాబాద్కు బయలుదేరి వెళ్లారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూను విధించడానికి ఒక్కరోజు ముందే అంటే.. మార్చి 21వ తేదీ మధ్యాహ్నం వారు రాజధాని అమరావతి ప్రాంతంలోని ఉండవల్లి నుంచి హైదరాబాద్కు వెళ్లారు. ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు. జనతా కర్ఫ్యూ ముగిసిన వెంటనే లాక్డౌన్ అమల్లోకి రావడంతో అక్కడే ఉండిపోయారు.
ఇదివరకు కేంద్రానికి అనుమతి..
ఇదివరకు చంద్రబాబు ఏపీకి రావడానికి కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. విశాఖపట్నం రూరల్ జిల్లా ఆర్ఆర్ వెంకటాపురంలో గల ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి స్టైరిన్ గ్యాస్ వెలువడిన సమయంలో బాధితులను పరామర్శించడానికి చంద్రబాబు ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. విశాఖపట్నానికి వెళ్లడానికి తనకు అనుమతి ఇవ్వాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖను కోరారు. కేంద్రం అనుమతి ఇవ్వకపోవడం వల్ల ఏపీకి రావడానికి కుదర్లేదు.
ఈ సారి ఏపీ డీజీపీకి
ఈ సారి ఆయన నేరుగా ఏపీ డీజీపీకి లేఖ రాశారు. ఏపీకి రావడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. సోమవారం ఉదయం 10:35 నిమిషాలకు హైదరాబాద్ నుంచి విమానం ద్వారా నేరుగా విశాఖకు బయలుదేరి వెళ్తానని, అదే రోజు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటానని చంద్రబాబు ఈ లేఖలో పొందుపరిచారు. తన షెడ్యూల్ను వివరించారు. దీనికోసం అనుమతి ఇవ్వాలని గుంటూరు జిల్లా మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి లేఖ రాశారు. డీజీపీ కార్యాలయం సూచనప్రాయంగా అంగీకరించిందని తెలుస్తోంది. దీనిపై అధికారిక ఉత్తర్వులు ఇంకా వెలువడాల్సి ఉందని చెబుతున్నారు.
Recommended Video
ఆన్లైన్ ద్వారా మహానాడు
జూమ్ యాప్ ద్వారా ఆన్లైన్లో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ఏపీకి వస్తారా? లేదా? అనే అంశంపై భిన్న వాదనలు ఉన్నాయి. ఆన్లైన్ ద్వారా మహానాడు నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు హైదరాబాద్ నివాసంలో పూర్తయ్యాయని అంటున్నారు. దాన్ని ముగించుకున్న తరువాతే వస్తారని చెబుతున్నారు. మహానాడును తెలంగాణలో ఉండి నిర్వహించడం కంటే ఏపీకి వచ్చిన తరువాత చేపట్టడం వల్ల రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు ఆస్కారం ఉండదనే వాదన కూడా వినిపిస్తోంది.