ఉండవల్లి ప్రజావేదికలో రంజాన్ వేడుకలు: కేక్ కట్ చేసిన చంద్రబాబు!
అమరావతి: పవిత్ర రంజాన్ పండగ సందర్భంగా ఉండవల్లి ప్రజావేదికలో ఏర్పాటు చేసిన వేడుకల్లో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వచ్చిన ప్రజలను చంద్రబాబు కలుసుకున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన ఖాదర్ అనే అభిమాని తీసుకొచ్చిన కేక్ను కట్ చేశారు.
ప్రవాసాంధ్రురాలైన యాంపాటి కృషవేణి తన కుటుంబంతో కలిసి చంద్రబాబును కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె పార్టీకి అయిదు లక్షల రూపాయల చెక్కును విరాళంగా అందించారు. పార్టీపట్ల అభిమానంతో మద్దతునిస్తున్న కృష్ణవేణి కుటుంబానికి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. కాగా- పలు జిల్లాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆయనను కలుస్తున్నారు. నైతిక మద్దతును తెలియజేస్తున్నారు.
బుధవారం సుమారు 500 మందికి పైగా పార్టీ కార్యకర్తలు చంద్రబాబును కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉండవల్లిలోని ప్రజా వేదిక సందడిగా మారింది. చిత్తూరు, గుంటూరు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం వంటి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు చంద్రబాబును కలుసుకుంటున్నారు. పార్టీ కార్యకర్తలకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అధికారంలో ఉన్నా, లేకున్నా కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా ఆదరిస్తామని చెప్పారు.
రాష్ట్రంలో కార్యకర్తలు ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ.. తన దృష్టికి తీసుకుని రావాలని సూచించారు. ఎక్కడ ఎటువంటి సంఘటన జరిగినా పార్టీ కేంద్ర కార్యాలయానికి సమాచారం అందించాలని, వాటిపై తగిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు తెలియజేశారు. ప్రతి కార్యకర్తకూ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దాడులు జరగకుండా ప్రభుత్వం సత్వరం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.