ఏపీలో పెన్షన్ల తొలగింపుకు నిరసనగా టీడీపీ పోరు: రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు
టీడీపీ నేడు రాష్ట్రంలో పించన్లు, రేషన్ కార్డుల రద్దుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తుంది . ఇప్పటికే రాజధాని అమరావతి కోసం పోరాటం సాగిస్తున్న టీడీపీ ఇప్పుడు మరో పోరాటానికి సిద్ధం అయ్యింది . ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల మంది పెన్షన్లు తొలగించారని పేర్కొన్న తెలుగుదేశం పార్టీ ఈ నేపధ్యంలో పెన్షన్ దారుల పక్షాన పోరాటం చేస్తుంది. అధినేత చంద్రబాబు వైసీపీ సర్కార్ పించన్ తొలగించటంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చెయ్యాలని పిలుపునిచ్చిన నేపధ్యంలో అన్ని చోట్లా ఆందోళనలు కొనసాగుతున్నాయి .
విజయవాడలో పింఛన్ల తొలగింపుపై ఆందోళన
పింఛన్ల తొలగింపుపై టీడీపీ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో విజయవాడలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు, పింఛన్ రద్దు అయిన మహిళలు, వృద్దులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ సీఎం జగన్ పాలనపై నిప్పులు చెరిగారు . పాలనను పక్కనబెట్టి ప్రజలపై కక్ష సాధిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వృద్దులు, వికలాంగులు, వితంతు పెన్షన్లు తొలగించడం ఏంటని ప్రశ్నించారు.
జగన్ పిచ్చి ముదిరి పాకాన పడిందన్న గద్దె రామ్మోహన్
పెన్షన్ లేకపోతే వృద్దులు, వికలాంగులు ఎలా బతకాలని గద్దె రామ్మోహన్ మండిపడ్డారు. వీరు ఆత్మస్థైర్యంతో జీవించాలని 200 ఉన్న పెన్షన్ను టీడీపీ 2000 వేలకు పెంచిందన్నారు. జగన్కి వైసీపీ వారు తప్ప రాష్ట్రంలో ఎవ్వరూ కనిపించడం లేదన్నారు. తొలగించిన పించన్లు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు . జగన్ పిచ్చి ముదిరి పాకాన పడిందని.. ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు గుణపాఠం చెప్పే రోజు దగ్గర్లోనే ఉందన్నారు గద్దె రామ్మోహన్.
విశాఖలో గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చిన టీడీపీ నేతలు
పెన్షన్ల రద్దుపై టీడీపీ నిరసనలో భాగంగా విశాఖ తూర్పు నియోజక వర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగింది . పెన్షన్లను పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేస్తూ గాంధీ విగ్రహానికి టీడీపీ నేతలు వినతి పత్రం సమర్పించారు. అనంతరం జీవీఎంసీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. తొలగించిన వారికి పెన్షన్ ఇవ్వాలని అధికారులకు వినతి పత్రం అందజేశారు. పెద్దఎత్తున పెన్షన్ దారులు, టీడీపీ శ్రేణులు ర్యాలీలో పాల్గొన్నారు.
తెనాలిలో సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ
తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో పెన్షన్ల తొలగింపుకు నిరసనగా తెనాలిలో టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు. టీడీపీ కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం తొలగించిన పించన్లు, రేషన్కార్డులు తక్షణమే పునరుద్దరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేసిన వారు సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విభిన్న రూపాల్లో ఆందోళనలు తెలియజేస్తున్నారు టీడీపీ నాయకులు. తొలగించిన పెన్షన్లను పునరుద్ధరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.