వైసీపీకి హ్యాపీ..టీడీపీకి బీపీ : చంద్రగిరిలో రీ పోలింగ్ : అసలు కధ ఏంటి....!
ఏపీలో ఫలితాల కోసం నిరీక్షిస్తున్న సమయంలో ఎన్నికల సంఘం ఏపీలో మరోసారి రీ పోలింగ్కు నిర్ణయించింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో అయిదు పోలింగ్ బూత్ల పరిధిలో రీ పోలింగ్కు నిర్ణయించింది. దీని పైన టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనలకు దిగింది. వైసీపీ సైతం నిర్ణయాన్ని స్వాగతిస్తూనే..మరో రెండు చోట్ల సైతం రీ పోలింగ్ నిర్వహించాల్సి ఉందని డిమాండ్ చేస్తోంది. టీడీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి తమ అభ్యంతరం వ్యక్తం చేసారు.
వైసీపీ హ్యాపీయే..అయినా..
చంద్రగిరి నియోజకవర్గంలో అయిదు కేంద్రాల్లో రీ పోలింగ్కు ఆదేశించటం పైన వైసీపీ సంతోషం వ్యక్తం చేస్తూనే.. మరో రెండు కేంద్రాల్లోనూ రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. తాము తొలుత ఏడు పోలింగ్ కేంద్రాల్లో అవకతవకలు జరిగాయని, వాటిల్లో రీపోలింగ్ జరిపించాలని ఫిర్యాదు చేస్తే, కేవలం ఐదు చోట్ల మాత్రమే అనుమతి ఇవ్వడంపై వైసీపీ అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. చంద్రగిరి నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఫిర్యాదుపై స్పందించిన ఈసీ వివరణ కోరగా, రిటర్నింగ్ అధికారులు పంపిన రిపోర్టుల ఆధారంగా ఐదు కేంద్రాల్లో రీపోలింగ్ కు ఆదేశాలు జారీ అయ్యాయని స్పష్టం చేస్తున్నారు. ఈసీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెబుతూనే, మిగతా రెండు కేంద్రాల విషయంలోనూ ఇదే విధమైన నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా చెవిరెడ్డి డిమాండ్ చేశారు.
టీడీపీ నేతల అభ్యంతరం..
పోలింగ్ ముగిసిన నెల రోజుల తరువాత రీపోలింగ్ ఏమిటని టీడీపీ ప్రశ్నిస్తోంది. తాము లేవనెత్తిన అభ్యంతరాలను పట్టించుకోని ఎన్నికల కమిషన్, వైసీపీ ఇచ్చిన ప్రతి ఫిర్యాదుపైనా వారికి అనుకూలంగా స్పందిస్తోందని ఆరోపించింది. ఎన్నికల సంఘం తీరును నిరసనగా టీడీపీ శ్రేణులు తిరుపతిలో ఆందోళనకు దిగాయి. చంద్రగిరిలో ఐదు చోట్ల రీపోలింగ్కు ఇప్పుడు ఆదేశించడం అన్యాయమని టిడిపి నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటున్నారని టీడీపీ ఫిర్యాదు చేస్తే కనీసం రియాక్షన్ కూడా ఉండదంటూనే ఈసీ ఎందుకిలా చేస్తోందో అర్థం కావడం లేదని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తన్నారు. దీని పైన టీడీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘంతోనూ సమావేవమయ్యారు. చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు బూత్లలో రీపోలింగ్కు ఆదేశించడంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 32 రోజుల తర్వాత రీపోలింగ్ ఏంటని కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీడీపీ నేతలు ప్రశ్నించారు.
సిసి కెమేరాల ఫుటేజ్ ఆధారంగా..
రీ పోలింగ్ నిర్ణయానికి ముందు వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఎస్ లేఖను సీఈవోకు పంపారని దీంతో రీ పోలింగ్కు ఆదేశాలు వచ్చాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రగిరి అధికారులు సైతం తాము రీ పోలింగ్కు నివేదిక ఇవ్వలేదని స్పష్టం చేసారు. అదే సమయంలో వైసీపీ నేతలు మాత్రం తాము చేసిన ఫిర్యాదుల ఆధారంగానే పోలింగ్ బూత్లలో సీసీ కెమారా ఫుటేజ్ పరిశీలించిన తరువాత మాత్రమే ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుందని వివరిస్తున్నారు. దీంతో..ఇప్పుడు రీ పోలింగ్ వ్యవహారం రాజకీయంగా వేడెక్కుతోంది.