కృష్ణానది రక్షణ గోడపై టీడీపీ విన్నూత్న నిరసన- నదిలో తవ్విన గోతుల్లో నిల్చుని...కృష్ణానది రక్షణ గోడపై
విజయవాడలో కృష్ణానది రక్షణ గోడ వ్యవహారం ఎప్పుడూ చర్చనీయాంశమవుతూనే ఉంటోంది. ప్రభుత్వాలు మారినా బాధితులను ఆదుకునే విషయంలో కనికరం చూపకపోవడంతో ఈ రక్షణ గోడ మరోసారి తెరపైకి వచ్చింది. కృష్ణానది రక్షణ గోడ నిర్మాణంలో భాగంగా ఇళ్లను తొలగించేందుకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై టీడీపీ ఇవాళ నిరసనలకు దిగింది.
కృష్ణానది వరద బాధితులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ టీడీపీ నేతలు ఇవాళ నదిలో నిరసనకు దిగారు. నదిలోనే గోతులు తవ్వి, అందులో నిలబడి ప్లకార్డులతో టీడీపీ నేతలు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. కృష్ణానది వరద బాధితులకు ప్రభుత్వం పది వేల రూపాయల సాయం అందించాలని ఎమ్మెల్యే రామ్మోహన్ డిమాండ్ చేశారు.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రూ.550 కోట్ల వ్యయంతో కృష్ణానది రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టామని, అప్పట్లో నది పక్కన నివసిస్తున్న వారి ఇళ్లను తొలగించలేదని, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మాత్రం ఇళ్లను తొలగించడం దారుణమని టీడీపీ నేతలు ఆరోపించారు. టీడీపీ హయాంలో రెండున్నర కిలోమీటర్ల మేర గోడ నిర్మాణం పూర్తయిందని, రెండోదశ నిర్మాణంలో భాగంగా మూడొంతుల ఇళ్లు తొలగించేందుకు ప్రభుత్వం నోటీసులిచ్చిందని టీడీపీ నేతలు ఆరోపించారు.
Recommended Video
ఇళ్లకీ, గోడకీ మధ్య 70 అడుగుల స్ధలం వదిలి వాల్ నిర్మాణం పూర్తి చేయాలని, 70 అడుగుల రోడ్డు కూడా పూర్తి చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఇళ్లు తొలగించకుండా రక్షణ గోడ నిర్మించాలని, చేతకాకుంటే తప్పుకోవాలని, తాము పూర్తి చేసే చూపిస్తామని టీడీపీ నేతలు సవాల్ చేశారు.