వీర జవాన్ల మరణాల్లోనూ కులాన్ని బట్టి సాయమా ? వైసీపీ తీరుపై టీడీపీ ఫైర్..
ఏపీకి చెందిన వీరజవాన్ల కుటుంబాలకు అందించే సాయం విషయంలో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణిని విపక్ష టీడీపీ తీవ్రంగా తప్పుబట్టింది. కులాన్ని బట్టి వీర జవాన్ల కుటుంబాలకు సాయం చేస్తారా అని వైసీపీ సర్కారును నిలదీసింది. తాజాగా జరిగిన రెండు ఘటనలను ప్రస్తావిస్తూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు.
వీరజవానుల మరణాల్లో కూడా కులాన్ని బట్టి సహాయం అందించడం మన రాష్ట్ర అధికారపార్టీకే చెల్లిందని అచ్చెన్నాయుడు విమర్శించారు. ఉగ్రవాదుల ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందిన వజ్రపుకొత్తూరు మండలం పలాస నియోజకవర్గానికి చెందిన బొంగు బాబురావు కుటుంబానికి కనీసం ఒక సంతాపసందేశం కూడా పంపలేని ముఖ్యమంత్రి, జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో వీరమరణం పొందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి 50 లక్షలరూపాయల ఆర్థిక సాయం ప్రకటించడం సరికాదన్నారు.
అమరవీరుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం సాయం అందించడాన్ని విమర్శించటం లేదు కానీ బొంగు బాబురావు కుటుంబానికి ఎందుకు సహాయం చేయలేదని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ప్రజలు గమనించటం లేదా, లేక గమనించి కూడా అడిగే దేర్యం చేయటం లేదా అర్ధం కావటం లేదని అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మరణాన్ని కూడా కులాలతో చూస్తున్న ప్రభుత్వం వలన రాష్ట్ర పతనమే తప్ప ఇంకొకటి లేదన్నారు..