పురంధరేశ్వరీకి టిడిపి కౌంటర్: రెవిన్యూలోటుకు కొత్త నిర్వచనం
అమరావతి:కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఇంగ్లీషులో చెప్పిన అంశాలనే తెలుగులో బిజెపి నేత పురంధరేశ్శరీ చెప్పారని టిడిపి అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. పురంధరేశ్వరీ చెప్పిన విషయాల్లో కొత్త అంశమే లేదన్నారు.
ఏపీ రాష్ట్రానికి నిధుల కేటాయింపు విషయంలో టిడిపి, బిజెపి నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది. మూడు రోజుల క్రితం ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే సమస్యే లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఈ ప్రకటనతో తీవ్ర మనోవేదనకు గురైన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కేంద్ర మంత్రివర్గం నుండి వైదొలిగారు.
ఎన్డీఏలోనే ఉంటారా, వైదొలుగుతారా, బాబు నెక్ట్స్ ప్లాన్ ఏమిటి?
రెవిన్యూలోటు విషయంలో కేంద్రం చెబతున్న లెక్కలతో ఏపీ రాష్ట్రం ఒప్పుకోవడం లేదు. ఈ విషయమై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో జరిగిన సమావేశంలో కూడ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు రాష్ట్ర వాదనను సమర్ధవంతంగా విన్పించారు.బిజెపి నేత పురంధరేశ్వరీ విమర్శలపై టిడిపి అధికార ప్రతినిధి లంకా దినకర్ శుక్రవారం గట్టి కౌంటరిచ్చారు.
పురంధరేశ్వరీకి కౌంటరిచ్చిన టిడిపి
మాజీ కేంద్ర మంత్రి, బిజెపి నేత పురంధరేశ్వరీకి టిడిప గట్టి కౌంటరిచ్చింది. రెవెన్యూ లోటుకు బీజేపీ నేతలు కొత్త నిర్వచనం ఇవ్వాలనుకుంటున్నారా? అని టీడీపీ ప్రశ్నించింది. ఏడాదిన్నరలో కొంత మొత్తంలో నిధులు విడుదల చేసిన తర్వాత... రూ. 7,200 కోట్లకు మించి ఇవ్వమని రెవెన్యూ లోటులో కేంద్రం చెప్పిందని టిడిపి అధికార ప్రతినిధి లంకా దినకర్ గుర్తు చేశారు.
రెవిన్యూలోటుకు కేంద్రం కొత్త నిర్వచనం
రెవిన్యూలోటుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిర్వచనం చెబుతోందని టిడిపి అధికార ప్రతినిధి లంకా దినకర్ అభిప్రాయపడ్డారు.రుణమాఫీ అనేది రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కొత్త పథకమని దానికి సంబంధించిన రూ. 3,600 కోట్లు కేంద్రం ఇవ్వదని చెప్పారని, అలాగే పే రివిజన్ వల్ల జీతాలు అదనంగా పెరిగిన వాటికి తాము పరిగణలోకి తీసుకోమని, డ్వాక్రా రుణాలు కూడా రాష్ట్రానికి సంబంధించినదేనని, వాటితో కేంద్రానికి సంబంధం లేదని పేర్కొందని, అలా అనడం సరికాదని ఆయన అన్నారు. రెవెన్యూ లోటు అనే పదానికి కొత్త నిర్వచనం ఇవ్వదలిచారా? అంటూ దినకర్ ప్రశ్నించారు.
జైట్లీ మాటలను తెలుగులో చెప్పారు
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఇంగ్లీషులో చేసిన ప్రకటనను యధాతథంగానే తెలుగులో కేంద్ర మాజీ మంత్రి మంత్రి, బిజెపి నేత పురంధరేశ్వరీ చేశారని టిడిపి నేత అనురాధ విమర్శించారు. డీపీఆర్, యూసీలు ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మూడో స్థానంలో ఉందన్న విషయాన్ని పురందేశ్వరీ గుర్తుంచుకోవాలని ఆమె అన్నారు.
ఎయిమ్స్కు కేంద్రం ఎన్ని నిధులిచ్చింది
మంగళగిరి ఎయిమ్స్కు ఏపీ ప్రభుత్వం ఎంత విలువైన స్థలం ఇస్తే కేంద్రం ఎన్ని కోట్లు విడుదల చేసిందో కూడా బీజేపీ నేతలు చెబితే బాగుండేదని అనురాధ అన్నారు. రెండు పార్టీల మధ్య ఏపీ రాష్ట్రానికి నిధుల కేటాయింపు విషయంలో మాటల యుద్దం కొనసాగుతోంది.