త్వరలో టీడీపీ రిజెక్టెడ్ లిస్ట్...30 నుంచి 40 మందికి ఉద్వాసన:సిట్టింగ్ ల గుండెల్లో గుబులు
అమరావతి:త్వరలో టిడిపి నుంచి రెండు లిస్ట్ లు విడుదల కాబోతున్నాయట...ఒకటి వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎమ్మెల్యే టికెట్లు పొందినవారి ఫస్ట్ లిస్ట్ కాగా...మరొకటి రిజెక్టెడ్ లిస్ట్...అంటే సిట్టింగులు అయివుండి...వచ్చే ఎన్నికలకు ఎమ్మెల్యే టికెట్ తిరస్కరించబడినవారు.
ఈ విషయం తెలియడంతోనే సిట్టింగ్ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. ఇలా ఉద్వాసనకు గురయ్యేవారు సుమారు 40 మంది వరకూ ఉంటారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ వడపోత కార్యక్రమం సాగుతోందని తెలియడంతో పలువురు టిడిపి ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్లు కలత చెందుతున్నట్లు తెలిసింది. టికెట్ల కేటాయింపుల వ్యవహారంలో కొన్ని చోట్ల మదనపల్లె ఫార్ములా ఉపయోగించాలని టిడిపి అధిష్టానం నిర్ణయించింది.
టిడిపిలో...ఎన్నికల సన్నాహాలు
ఆంధ్రప్రదేశ్లో మిగిలిన పార్టీల విషయం అటుంచితే టిడిపిలో ఎన్నికల సన్నాహాలు ప్రారంభమైన సూచనలు కనిపిస్తున్నాయి. ఎప్పుడూ అధికార కార్యక్రమాలతో క్షణం తీరికలేకుండా గడిపే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు పార్టీ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టిపెడుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఈ ఎన్నికల సన్నాహాలకు సంబంధించి మంగళవారం టిడిపి అధినేత చంద్రబాబు నేతృత్యంలోనే ఆ పార్టీకి సంబంధించి అతి కీలక సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో పొత్తులు,తెలంగాణలో పార్టీ భవితవ్యానికి సంబంధించిన నిర్ణయాలు తదిదర అంశాలపై విస్తృత చర్చ జరిగింది.
జాబితాలు...తయారవుతున్నాయి...
ఈ క్రమంలో ఎన్ని ఘట్టంలో అతి ముఖ్యమైన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా చంద్రబాబు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వడపోత సౌలభ్యం కోసం ఒకవైపు సెలెక్టడ్ లిస్ట్ ...మరోవైపు రిజెక్టెడ్ లిస్ట్ కూడా సిఎం చంద్రబాబు తయారుచేయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలో సమస్యాత్మకమైన చోట్ల మదనపల్లె ఫార్ములా వాడాల్సిందిగా స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే పార్టీ ముఖ్యులకు సూచించారట. ముగ్గురు నేతలు నియోజకవర్గం స్థాయిలోని మూడు కీలకమైన పదవులు అంటే ఉదాహరణకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇలా ఆ మూడు పదవులను ఎమ్మెల్యే టికెట్ ఆశించే ముఖ్యులు ముగ్గురూ పంచుకొని...తమలో ఎవరికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చినా ఫర్వాలేదనీ, అందరం కలిసి పనిచేసుకుంటామనీ చెప్పడమే మదనపల్లె ఫార్ములా...అక్కడి నేతలు ఇలా చేయడం...వారి నిర్ణయానికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
టిడిపి టికెట్ల కోసం...తీవ్రమైన పోటీ
అధికార పార్టీ కావడం వల్లో...ప్రతిపక్ష పార్టీలపైన నమ్మకం లేకనో రాష్ట్రంలోని అనేక స్థానాల్లో టీడీపీ టిక్కెట్ల కోసం విపరీతమైన పోటీ ఏర్పడింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో కూడా "మదనపల్లె ఫార్ములా''ని పాటించాలని టిడిపి అధిష్టానం నిర్ణయించింది. అయితే ఈసారి సార్వత్రిక ఎన్నికలకు చాలా ముందుగానే కనీసం 40 మంది అభ్యర్ధులను ప్రకటించాలని టీడీపీ హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఆ 40 మంది ఎవరనే విషయంపై కూడా ఆ పార్టీలో ఇప్పటికే స్పష్టత ఉందంటున్నారు. అయితే ప్రత్యర్ధుల వ్యూహాలను తిప్పికొట్టేలా ఈ జాబితాను విడుదల చేయాలని పార్టీ అధినేత చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.
రిజెక్టెడ్ లిస్ట్...వాళ్ల పేర్లు గ్యారెంటీ
ఇక ఎన్నడూలూని విధంగా టిడిపి రిజెక్టెడ్ లిస్ట్ కూడా ఒకటి తయారుచేయిస్తోందంటున్నారు. ప్రస్తుత సిట్టింగ్ లలో మళ్లీ టికెట్ లభించే అవకాశం లేనివాళ్ల పేర్లను ఈ జాబితాలో చేరుస్తారు. ఈ నాలుగేళ్లలో తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొని...సీఎం పలుమార్లు హెచ్చరించినా ప్రవర్తన మార్చుకోని వారికి ఉద్వాసన పలకాలని టీడీపీ అధిష్టానం డిసైడ్ అయినట్లు తెలిసింది. నియోజకవర్గాల్లో సర్వేల సందర్భంగా స్థానిక టీడీపీ కార్యకర్తలు, నేతలు ఏకగ్రీవంగా వ్యతిరేకించిన ఎమ్మెల్యేల పేర్లను ఈ జాబితాలో చేరుస్తారు. అలాగే ఇటీవల చంద్రబాబు చేయించిన ఒక సర్వేలో కూడా ఇలాంటివారి గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయని తెలిసింది. ఉదాహరణకు గుంటూరు జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్ధులను మార్చకపోతే పార్టీ దెబ్బతినడం ఖాయమని స్పష్టమైన సంకేతాలు అందాయట.
ముందే...చెప్పాలని
తీవ్ర వ్యతిరేకత ఉన్న నేతలకు టిక్కెట్ నిరాకరించినా వారు పార్టీకి కొత్తగా చేసే నష్టం ఏమీ ఉండదని కార్యకర్తలు బల్లగుద్ది చెబుతున్నారట. అసలు 2014 ఎన్నికల సమయంలో టిక్కెట్లు పొందిన ఆ నేతల గురించి తమకు ఏమీ తెలియదనీ, అయినా కేవలం పార్టీ అభిమానంతోనే వారిని గెలిపించామని...ఇప్పుడు మాత్రం తొలగించాల్సిందే అంటున్నారట. అలాంటివారు...అలాగే తాను చేయించిన సర్వే వివరాలు క్రోడీకరించి పార్టీకి గుదిబండలుగా మారేవారిని గుర్తించి వచ్చే ఎన్నికలకు ముందుగానే స్పష్టం చేయాలని చంద్రబాబు నిర్ణయించారట.
కొందరు ఇన్...మరికొందరు ఔట్
అయితే 2014 ఎన్నికల్లో ఓడినవారిలో కొందరు నియోజకవర్గాల ఇన్ఛార్జ్లుగా వ్యవహరిస్తూ చక్కటి ప్రతిభ కనబరుస్తున్నారనీ, వాళ్లలో కొందరి పేర్లు టికెట్లు పొందేవారికి సంబంధించిన తొలి జాబితాలో చోటుచేసుకునే అవకాశముందనీ టీడీపీ పెద్దలు అంటున్నారు. ఆ జాబితాలో మంత్రి సోమిరెడ్డి పేరు ఉండటం ఖాయమని చెబుతున్నారు. అలాగే వైసిపి నుంచి టిడిపిలోకి విచ్చేసిన కొందరు పెద్ద నేతలకు సైతం స్థానికంగా టిడిపి నేతలతో విభేదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఆ సమస్యపై కూడా దృష్టి సారించాలని టిడిపి అధిష్టానంపై తెలుగు తమ్ముళ్లు వత్తిడి చేస్తున్నారట. ఆ క్రమంలో సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామాలు చేటుచేసుకుంటాయని ఆ పార్టీ వర్గాలే చెబుతుండటం కొసమెరుపు.