పవన్ కళ్యాణ్ 'రాజ్యసభ'పై టీడీపీ కౌంటర్, 'రూ.50 కోట్ల వరకు ఖర్చు'
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్లపై ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షులు కళా వెంకట్రావు సోమవారం మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో అంటకాగుతూ టీడీపీపై విమర్శలు చేస్తున్నాయని వాపోయారు.
మీరు చెప్పారనే, ఆ బాధ్యత మీదే: పవన్తో రైతులు, బాబుకు జనసేనాని వార్నింగ్
ప్రత్యేక హోదా, విభజన హామీల కోసమంటూ వైసీపీ ఇచ్చిన మంగళవారం నాటి బందును ప్రజలు పట్టించుకోవద్దని సూచించారు. వైసీపీ బీజేపీతో లోపాయికారి ఒప్పందం పెట్టుకొని ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తామని చెబితే ప్రజలు ఎలా నమ్ముతారని ఆయన ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ రాజ్యసభ సీటుపై..
ప్రత్యేక హోదా, విభజన హామీలపై తెలుగుదేశం పార్టీ పోరాటం కొనసాగుతుందని కళా వెంకట్రావు అన్నారు. అదే సమయంలో పవన్ చేసిన రాజ్యసభ సీటు కామెంట్లపై కళా స్పందించారు. ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తామనే చర్చ పార్టీలో జరగలేదన్నారు. పవన్కు ఓ రాజకీయ విధానం అంటూ ఏదీ లేదన్నారు. ట్విట్టర్లో ఏదో ఒకటి అంటే సరిపోదాన్నారు.
జేసీ దివాకర్ రెడ్డి పార్టీ వీడరు
పార్టీ సీనియర్ నేత, అనంతపురం తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అలకపై కూడా కళా వెంకట్రావు స్పందించారు. జేసీ పార్టీకి చెందిన సీనియర్ నేత అన్నారు. ఆయన పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదని కితాబిచ్చారు. అలాంటి నేత పార్టీ వీడుతారని తాము అనుకోవడం లేదని చెప్పారు.
చంద్రబాబు ఆ పని ఎప్పుడు చేయలేదు
రేపటి వైసీపీ బంద్కు అందరూ మద్దతివ్వాలని ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. టీడీపీ, బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరినట్లుగా కనిపిస్తోందని ఆరోపించారు. ఏపీ ప్రయోజనాల విషయంలో అందర్నీ కలుపుకొని పోయే ప్రయత్నం చంద్రబాబు ఎప్పుడూ చేయలేదన్నారు. ప్రత్యేక హోదా లేకుంటే ఏపీకి భవిష్యత్తు లేదన్నారు. అవిశ్వాసం సమయంలో బీజేపీ, టీడీపీ ధోరణిలు బయటపడ్డాయన్నారు. రేపటి బందును అందరూ విజయవంతం చేయాలని కోరారు. బీజేపీని ఒప్పించి ప్రత్యేక హోదా తీసుకు రావాల్సిన టీడీపీ విఫలమైందన్నారు. అవిశ్వాసం పేరుతో టీడీపీ తప్పించుకునే ప్రయత్నం చేసిందని చెప్పారు. హోదా ఇవ్వలేమని బీజేపీ చెప్పడం అవమానమే అన్నారు.
దీక్షల కోసం రూ.40 నుంచి రూ.50 కోట్ల వరకు
చంద్రబాబు ధర్మపోరాట దీక్షల పేరుతో ప్రజల సొమ్ము వృథా చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ధర్మపోరాట దీక్షల కోసం చంద్రబాబు దాదాపు రూ.40 కోట్ల నుంచి 50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని తమ పార్టీ సమావేశాలకు వాడుకోవడం దారుణం అన్నారు. టీడీపీ, బీజేపీ ఎప్పటికీ మిత్రులేనని పార్లమెంటు సాక్షిగా తేలిందన్నారు. పార్లమెంటులో అవిశ్వాసంపై జరిగిన చర్చలో టీడీపీ విఫలమైందని, దీనికి నిరసనగా బంద్ విజయవంతం చేయాలన్నారు. టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే తమ బందుకు సహకరించాలన్నారు.