జగన్ డబుల్ ప్లాన్, మోడీకి నేనెందుకు భయపడతా: బాబు, ఫోన్తో టీడీపీ యూటర్న్, మారిన వ్యూహం
అమరావతి: కేంద్రానికి తాను భయపడుతున్నానని వైసీపీ అధినేత వైయస్ జగన్, ఇతరుల చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఎంపీలతో జరిగిన భేటీలో ఆయన ప్రతిపక్ష నేతపై ఊగిపోయారు. బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరుగుతుందన్న నేపథ్యంలో చంద్రబాబు వరుసగా నేతలతో భేటీ అయిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కేంద్రానికి భయపడటం లేదని చెప్పారు. నేను ఎవరికీ భయపడనని వ్యాఖ్యానించారు. అసలు నేను ఎందుకు భయపడతానని ప్రశ్నించారు. నాపై ఎలాంటి కేసులు లేవని, తనపై ఏ కేసులు పెడతారని అడిగారు.
జగన్ డబుల్ గేమ్, రాజీనామా నిమిషం పని
తనపై ఇలా విమర్శలు చేస్తే తాను లెక్క చేయనని చంద్రబాబు చెప్పారు. తనకు ఎవరితోను లాలూచీ లేదని, ప్రజాప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు. వైయస్ జగన్ డబుల్ గేమ్ ఆడుతున్నారని మండిపడుతున్నారు. రాజీనామాలు చేయడం, పదవులు వదులుకోవడం నిమిషం పని అని చెప్పారు.
డబుల్ అడ్వాంటేజ్
తనకు ఎవరితోను లాలూచీ లేదని, ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని చంద్రబాబు అన్నారు. జగన్ది డబుల్ గేమ్ అని, అతని కేసులు మాఫీ కావాలని, టీడీపీపై బురద జల్లాలని చెప్పారు. ఈ రెండు అతని లక్ష్యాలన్నారు. డబుల్ అడ్వాంటేజ్ పొందాలన్నదే జగన్ గేమ్ ప్లాన్ అన్నారు. వాళ్లు కేంద్రానికి దగ్గరవ్వాలని చూస్తూ మనపై బురద జల్లుతున్నారన్నారు.
ఒత్తిడి అంతర్గతం
ఏపీకి కేంద్రం అన్యాయం నిన్నటి వరకు ఉన్న ఒత్తిడి మన అంతర్గతమని, రేపటి నుంచి ఇక బహిర్గతం అని చంద్రబాబు ఎంపీలతో అన్నారు. బడ్జెట్ వరకు సమయం ఇచ్చామన్నారు. తనకు ఎవరి పైనా కోపం, ఆగ్రహం లేదని చెప్పారు. అలాగే బీజేపీపై వ్యతిరేకత లేదని చెప్పారు. ప్రజాప్రయోజనాలు, ఏపీ ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు.
పార్లమెంటులో ఆందోళన లేదు.. మారిన టీడీపీ వ్యూహం
రాజ్నాథ్ సింగ్ నుంచి ఫోన్ రావడంతో టీడీపీ వ్యూహం మారింది. మొదట పార్లమెంటులో ఆందోళన చేయాలని పార్టీ ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అయితే, కేంద్రం నుంచి ఫోన్ రావడంతో వ్యూహాన్ని మార్చారు. కేటాయింపులపై ముందు కేంద్రంతో చర్చించాలని, పరిస్థితిని బట్టి ఆందోళన చేయాలా వద్దా అన్నది నిర్ణయిద్దామని నేతలకు సూచించారు.
అంతకుముందు ఇలా
అంతకుముందు ఇదే సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీలందరూ పార్లమెంటులో తమ గళాన్ని గట్టిగా వినిపించాలన్నారు. పోరాటంలో ఇది తొలి అడుగు మాత్రమేనని, కేంద్రం వైఖరి చూశాక కలిసుండాలా, విడిపోవాలా అన్న దానిపై నిర్ణయం తీసుకుందామని చెప్పారని తెలుస్తోంది. కాగా, పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు ఈ సమావేశానికి హాజరుకాలేకపోయారు. చైనా పర్యటన ముగించుకుని శనివారం రాత్రే ఆయన తిరిగొచ్చారు. అలసటగా ఉండటంతో రాలేకపోతున్నట్లు పార్టీ చంద్రబాబుకు చెప్పారని తెలుస్తోంది.