సొంత ఎంపీలకు బెదిరింపు: జగన్ ఎన్నారై సభ వెనుక షాకింగ్!
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం రాత్రి ఎన్నారైలతో లైవ్ కార్యక్రమంలో మాట్లాడారు. దీని పైన తెలుగుదేశం పార్టీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు.
టిడిపి నేతలు వర్ల రామయ్య, గాలి ముద్దుకృష్ణమ నాయుడు తదితరులు ఆయన పైన దుమ్మెత్తి పోశారు. పార్లమెంటు సభ్యులను బెదిరించేందుకే జగన్ ప్రవాసాంధ్రులతో సమావేశం ఏర్పాటు చేశారని వర్ల భగ్గుమన్నారు. తన జీవితం తెరిచిన పుస్తకమని యువతకు చెప్పే ధైర్యం ఉందా అని నిలదీశారు.
అదే సమయంలో ఆయన తుని ఘటన పైన తీవ్రంగానే స్పందించారు. తుని విధ్వంసం ఘటనలో ఉపయోగించిన డ్రోన్ కెమెరాల తీగ లాగితే లోటస్ పాండు డొంక కదులుతుందని మండిపడ్డారు. తుని ఘటనలో జగన్ పాత్ర పైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ప్రవాసాంధ్రులతో మాట్లాడే అర్హత జగన్కు ఉందా అని నిలదీశారు. 16 నెలలు జైలులో గడిపిన జగన్ ఇప్పటికీ 11 కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారన్నారు. ఏ అర్హతతో ప్రవాసాంధ్రుల సభ ఏర్పాటు చేశారన్నారు.
సొంత పత్రిక, సొంత ఛానల్ పెట్టుకొని ప్రవాసాంధ్రుల సభలో సీఎం చంద్రబాబును ఎగతాళి, చులకన చేస్తూ మాట్లాడటం తప్ప ప్రత్యేక హోదా కోసం పడిన తాపత్రయం ఏమీ లేదన్నారు. ఆయన పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు దూరం కాకుండా బెదిరించేందుకే దీనిని ఉపయోగించుకున్నారన్నారు.
మరోవైపు, గాలి ముద్దుకృష్ణమ కూడా జగన్ ఎన్నారై లైవ్ కార్యక్రమాన్ని తప్పుబట్టారు. విదేశాలలో ఉన్న తెలుగు వారిని జగన్ తన రాజకీయాల కోసం చీల్చే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
అలాగే ప్రత్యేక హోదా విషయమై జగన్ చేసిన వ్యాఖ్యల పైన స్పందించారు. రాజీనామాలతో ప్రత్యేక హోదా వస్తే క్షణంలో రాజీనామ చేస్తామని గతంలో తమ పార్టీ ఎంపీలు ఎప్పుడో చెప్పారన్నారు. జగన్ మాట్లాడుతూ.. హోదా కోసం ఉద్యమిస్తామని, అవసరమైతే రాజీనామాలు చేసేందుకు కూడా సిద్ధమని చెప్పారు. ఈ నేపథ్యంలో గాలి కౌంటర్ ఇచ్చారు.