అవినీతిపై టీడీపీ రివర్స్ అటాక్ .. కాన్ఫిడెన్సా..? కన్ఫ్యూజన్ చేసే ప్రయత్నమా..?
అమరావతి : రాజధాని పనులు, పోలవరం, ఇతర ప్రాజెక్టుల నిర్మాణంపై సీఎం జగన్, మంత్రులు, వైసీపీ చేస్తున్న వ్యాఖ్యలపై టీడీపీ స్పందించింది. అవినీతిపై రివర్స్ అటాక్ ప్రారంభించింది. కొండను తవ్వే ప్రయత్నం చేస్తున్న జగన్కు ఎలుకను కాదు కదా... చీమ, దోమలను కూడా పట్టరని గాంభీర్యం ప్రదర్శిస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా టీడీపీ పనిచేస్తుందని, ప్రజలపక్షానే నిలుస్తుందని అంటోంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
దోపిడీ ముఠాలకు నాయకత్వం మీది అంటూ విజయసాయి రెడ్డికి కౌంటర్ ఇచ్చిన టీడీపీ నేత బుద్దా వెంకన్న
అవినీతి మరకలు అంటించే ప్రయత్నం
వైసీపీ శ్రేణులు లేని అవినీతిని అంటించే ప్రయత్నం చేస్తున్నాయని టీడీపీకి ఆరోపింస్తోంది. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తుందని టీడీపీ అధ్యక్షుడు అంటున్నారు. ఆదివారం తన నివాసంలో సమావేశమైన నేతలతో యూరప్ పర్యటనలో ఉన్న చంద్రబాబు ఫోన్ టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తప్పుడు ఆరోపణలతో బురదజల్లే ప్రయత్నం చేస్తే అది తిరిగి వారికే అంటుకుంటుందని అన్నారు.
అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ప్రజల పక్షమే
అధికారంలో ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రజల పక్షానే నిలుస్తుందని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. వైసీపీ దాడులు, దౌర్జన్యాలకు గురైన కార్యకర్తలకు అండగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బాధిత కుటుంబాలను పరామర్శించడంతో పాటు వారికి భరోసా కల్పించాలని చెప్పారు. పోలవరం, ఇతర ప్రాజెక్టుల నిర్మాణం, రాజధాని పనుల్లో అవినీతి జరిగిందంటూ సీఎం జగన్, వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, ఇలాంటి ఆరోపణలు రాష్ట్రానికి మేలు చేకూర్చేవి కావన్నారు చంద్రబాబు.
ఎలుక కాదు చీమ, దోమను పట్టలేరు
వైసీపీ చేస్తున్న ఆరోపణలపై టీడీఎల్పీ నేత అచ్చెన్నాయుడు సైతం స్పందించారు. జగన్ కొండను తప్పుతానంటున్నాడని, అయితే ఆయన ఎలుక కాదు కదా.. చీమ, దోమను కూడా పట్టుకోలేరని ఎక్కడి నుంచి తవ్వుతారో ఎంత లోతున తవ్వుతారో అంత లోతున తవ్వండని అన్నారు. తమపై విమర్శలు చేస్తున్న కేబినెట్ మంత్రులు గతంలో జగన్ గురించి ఏ మాట్లాడారో తమ వద్ద రికార్డులున్నాయన్న అచ్చెన్నాయుడు.. గతంలో ఆయన అవినీతిని విమర్శించిన వాళ్లంతా ఇప్పుడు పక్కనచేరి నీతులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. బొత్స సత్యనారాయణ, కన్నబాబు తదితరులు జగన్ అవినీతి గురించి ఏం మాట్లాడారే అందరికీ గుర్తుందని విమర్శించారు.
Recommended Video
ఆరోపణలు తప్పని అంగీకరిస్తున్నారా?
పోలవరం విషయంలో జగన్ చేస్తున్న ఆరోపణలను టీడీపీ నేతలు ఖండించారు. ఈ ప్రాజెక్టుపై గతంలో ఎన్నో ఆరోపణలు చేసిన ఆయన.. ఇప్పుడు అవినీతి బయటపెట్టే అధికారులను సన్మానిస్తామని అంటున్నారని అన్నారు. దీన్నిబట్టి గతంలో ఆయన చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనని అంగీకరిస్తున్నారా అని యనమల రామకృష్ణుడు మండిపడుతున్నారు. మరోవైపు టీడీపీపై అవినీతి ఆరోపణలు చేసిన తనపై ఉన్న అభియోగాలను పలుచన చేసుకోవాలనే జగన్ ప్రయత్నాలు ఎన్నటికీ నెరవేరవని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు. టీడీపీ అవినీతిని బయటకు తీస్తానన్న జగన్ వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు ఇంత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం హాట్ టాపిక్గా మారింది. తమ హయాంలో జరిగిన అవినీతిని బయటపెడతారాన్న భయంతో టీడీపీ నేతలు కన్ఫ్యూజన్లో పడ్డారా? లేక తమపై ఎలాంటి చర్యలు తీసుకోరన్న కాన్ఫిడెన్స్తో ఉన్నారా? అనే అంశంపై చర్చ సాగుతోంది.