వైసీపి ప్రభుత్వం పై టీడిపి రివర్స్ ఎటాక్..! ఫ్యాన్ స్విచ్ తెలంగాణలో ఉందని ప్రచారం..!!
అమరావతి/హైదరాబాద్ : అన్ని వైపులా ముప్పేట దాడి మొదలైంది. ఒక పక్క నేతలు చెల్లాచెదురైపోతున్నారు. మరోపక్క కార్యకర్తలు మనోధైర్యం కోల్పోతున్నారు. సంక్షోభం నుంచి అవకాశాన్ని వెతుక్కుంటా అనే టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు ఆ పనిలో బిజీగా వున్నారు. మిన్ను విరిగి మీద పడినా కూల్ గా తన రాజకీయాన్ని నడిపించాలని ఆయన చూస్తున్నారు.
రాజకీయ పార్టీలు ఏవైనా..ఎవరు అధికారం చేపట్టినా ఎన్నికల ముందు ఎన్ని చెప్పినా పదవిలోకి వచ్చాకా తమ పంథాలో తాము సాగిపోతాయి. గత ప్రభుత్వంపై అనేక అవినీతి ఆరోపణలు, విమర్శలు చేసి అధికారం హస్తగతం అయ్యాకా వాటిని విస్మరించడం రివాజు. వారు చేసిన తప్పుడు పనులకు అక్రమాలకు ప్రజలే ఎన్నికల్లో బుద్ధి చెప్పారంటూ చెప్పుకురావడం సర్కార్ లో ఉన్నవారు రొటీన్ డైలాగ్స్ గానే మిగిలిపోతాయి.
Recommended Video
అదికార ప్రతిపక్షాల మద్య మాటల యుద్దం..! స్పీడు పెంచిన టీడిపి..!!
రాబోయే రోజుల్లో జగన్ సర్కార్ దూకుడును ఎలా అడ్డుకోవాలా అని యోచిస్తోంది టీడీపీ. వైసీపీ, బీజేపీ లనుంచి ఎదురౌతున్న సమస్యలను బాబు ఎదుర్కొనే తీరుపైనే క్యాడర్ లో ధైర్యం ఏర్పడుతుంది. కనుక ఆచితూచి వైసిపి రాజకీయాన్ని తిప్పికొట్టేందుకు సిద్ధం అయ్యారు. పొరుగు రాష్ట్రంతో మంచి సంబంధాలు అభివృద్ధికి సోపానాలు అని ఎపి ముఖ్యమంత్రి జగన్ యోచిస్తున్నారు. జగన్ ఆలోచనలకు తగిన విధంగానే తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు స్పందించి ముందుకు వచ్చారు. ఒకరకంగా చంద్రశేఖర్ రావు ఈ విషయంలో మరింత చొరవ చూపుతున్నారు. ఎన్నికల ముందు చంద్రశేఖర్ రావు ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి రావాలని కోరుకున్నారు. ఆ అంశాన్నే తన ఎన్నికల ప్రధాన విమర్శనాత్మకంగా మార్చుకుని టీడీపీ అధినేత చంద్రబాబు ఫ్యాన్ స్విచ్ తెలంగాణలో ఉందంటూ దాడి మొదలుపెట్టారు.
కేసీఆర్ బుజం మీద గన్ పెట్టి జగన్ కు గురి..! చంద్రబాబు మాస్టర్ ప్లాన్..!!
అయితే ప్రజలు ఈ అంశానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇప్పుడు అవే ఆరోపణలు పదేపదే చేయడం ద్వారా చంద్రశేఖర్ రావు ఏపీని వంచించి లబ్ది పొందుతున్నారనే వాదన గట్టిగా ప్రజల్లో నాటే ప్రయత్నం మొదలు పెట్టారు బాబు బృందం. మన భవనాలు వారికి ఇచ్చేశారు, మన నీళ్ళు వాళ్ళు పట్టుకుపోయే కుట్ర జరుగుతుంది. ఇలా ప్రతి అంశం జనం మదిలో చొప్పిస్తే వచ్చే ఎన్నికల నాటికి తమకు సానుకూలం అవుతుందని టిడిపి అధినేత చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తుంది. అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ పై నెగిటివ్ రావడం ఇప్పట్లో సాధ్యం కాదు కనుక ఈ రూట్ లో వెళ్లడమే సరైనదని బాబు ఆలోచన అంటున్నారు విశ్లేషకులు. మరి ఈ వ్యూహాన్ని ఎపి సీఎం జగన్ ఎలా తిప్పికొడతారో చూడాలి.
ఓటమినుండి కోలుకుంటున్న టీడిపి..! ప్రభుత్వం పై ప్రతిదాడికి సిద్దమవుతున్న తమ్ముళ్లు..!!
ఇదిలా ఉండగా టీడిపి కార్యకర్తలపై వైసిపీ దాడులు పెరిగిపోయాయని.. కార్యకర్తల్ని కాపాడుకునే బాధ్యత తనపై ఉందని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజాస్వామ్యంలో దాడులకు ఏ మాత్రం స్థానంలేదని చెప్పారు. చిత్తూరు జిల్లా రామకుప్పంలో ఆయన మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా కర్ణాటక - ఆంధ్రా సరిహద్దు వద్ద ఆయనకు టీడిపి నేతలు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం రామకుప్పం కూడలి వద్ద ఏర్పాటు చేసిన సభలో ప్రజలనుద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ.. 'కుప్పం నియోజకవర్గంలో నన్ను గెలిపించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. గత 30 ఏళ్లుగా నా పట్ల మీ ఆప్యాయత చూస్తున్నా. ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా మీ ఇంట్లో బిడ్డగా నన్ను ఆదరించారు. నా జీవితాంతం మీకు రుణపడి ఉంటా. ఎమ్మెల్యేగా, సీఎంగా మీ గౌరవాన్ని పెంచేందుకే నేను పనిచేశా' అన్నారు చంద్రబాబు.
టీడిపిని తిరిగి అధికారంలోకి తెస్తాం..! కాపు నేతల ఉమ్మడి ప్రకటన..!!
ఇక క్షేత్రస్థాయిలో అనుభవాలను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చామని మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అన్నారు. టీడిపి కి చెందిన కాపు నేతలంతా అమరావతిలో చంద్రబాబుతో సమావేశమయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను అడ్డుకొని ముందుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. టీడిపి ని బలోపేతం చేసి మళ్లీ అధికారంలోకి తేవాలన్నదే తమ కర్తవ్యమన్నారు. ప్రజాసమస్యలపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరముందన్నారు. కార్యకర్తలకు మేమున్నామనే భరోసా కల్పించాలనే అంశంపై చంద్రబాబుతో చర్చించినట్లు త్రిమూర్తులు తెలిపారు.