మీకు మాకు కాదు: బీజేపీతో కొట్లాటపై టీడీపీ ట్విస్ట్, మోడీపై యుద్ధమే: గల్లా జయదేవ్ ఘాటుగా
అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎంపీల పోరాటంపై బీజేపీ ఆరోపణలు బాధాకరమని టీడీపీ నేత రాజేంద్రప్రసాద్ సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోరాటాన్ని తాము కేంద్రం, ఏపీ ప్రభుత్వాల మధ్య సమస్యగా మాత్రమే చూస్తున్నామని కొత్త పాట పాడారు. దీనిని తెలుగుదేశం, బీజేపీ సమస్యగా చూడటం లేదని ట్విస్ట్ ఇచ్చారు.
Recommended Video
ఎందుకు ఊరుకున్నావ్, నిజాలు తేలుతాయి: బాబుకు పవన్ కళ్యాణ్ షాక్, ఇద్దరికీ డెడ్లైన్
ఏపీకి జరిగిన నష్టంపై చర్చకు రావాలని బీజేపీ సవాల్ విసరడం పైనా స్పందించారు. తాము చర్చకు సిద్ధమని చెప్పారు. ఏపీకి కాంగ్రెస్ నష్టం చేసిందని, ఇప్పుడు బీజేపీ కూడా అదే దారిలో వెళ్తోందని వాపోయారు. ఏపీ ప్రజలు ఏడాదికి సుమారు రూ.80 వేల కోట్ల పన్నులు కడుతున్నారన్నారు.
ఉత్తరాది రాష్ట్రాలకు దోచి పెడుతున్నారు
తమ డబ్బును అంత కేంద్రం ఉత్తరాది రాష్ట్రాలకు దోచి పెడుతోందని రాజేంద్రప్రసాద్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక్కడి బీజేపీ నేతలు విభీషణ పాత్ర పోషించాలని హితవు పలికారు. ప్రజలు వారిని విభీషణ పాత్ర పోషించాలని కోరుకుంటే వారు మాత్రం సైంధవ పాత్ర పోషిస్తున్నారన్నారు.
ఢిల్లీలో అందరి మద్దతు
ఏపీకి జరిగిన అన్యాయంపై స్పందించకుంటే యుద్ధం తప్పదని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ఆయన గుంటూరులో కార్యకర్తల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంతో చేతులు కలిపేందుకు వైయస్సార్ కాంగ్రెస్ ఉత్సాహం చూపిస్తోందని ధ్వజమెత్తారు. ఏపీకి జరిగిన అన్యాయంపై టీడీపీ ఎంపీలు చేస్తున్న పోరాటానికి ఢిల్లీలో అందరూ మద్దతిస్తున్నారని చెప్పారు.
ఏపీ ప్రజలు ఫూల్స్ కారు
ఏపీ ప్రజలు ఫూల్స్ కారని, ఎల్లకాలం మోసపోరని ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షులు అమిత్ షా గుర్తుంచుకోవాలని గల్లా జయదేవ్ అన్నారు. లోకసభలో గల్లా జయదేవ్ ఇటీవల చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తన సొంత నియోజకవర్గం చేరుకున్న ఆయనకు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికిన విషయం తెలిసిందే. గుంటూరు టీడీపీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
గోడ మీది పిల్లుల్లా వైసీపీ ఎంపీలు
యుద్ధం ప్రారంభమైందని, పోరాటానికి టీడీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని, ఢిల్లీకి వెళ్లి ఆందోళన చేసేందుకు సంసిద్ధులు కావాలని గల్లా జయదేవ్ పిలుపునిచ్చారు. ప్రధాని వ్యక్తిగతంగా బాధ్యత తీసుకొని చేస్తేనే ఏపీకి న్యాయం జరుగుతుందన్నారు. వైసీపీ ఎంపీలు పార్లమెంటులో గోడ మీది పిల్లుల్లా వ్యవహరిస్తున్నారన్నారు.
పీఎంవో చుట్టూ విజయసాయి ప్రదక్షిణలు
తమ ఆందోళనలను ప్రధాని మోడీ చూశారని, ఆయన ప్రసంగంలో ఏపీ గురించి మాట్లాడుతారని ఆశించామని, అందుకే ఆ సమయంలో లోకసభలో ఆందోళనలపై వెనక్కి తగ్గామని, వైసీపీ ఎందుకు వాకౌట్ చేసిందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఎంపీ విజయ సాయి రెడ్డి బీజేపీతో చేతులు కలిపేందుకు ఆరాటపడుతూ నిరంతరం ప్రధాని మోడీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.