జాతీయ పార్టీపై ఓ ప్రాంతీయ పార్టీ అవిశ్వాసం చారిత్రాత్మకం: సుజన
అమరావతి/న్యూఢిల్లీ: జాతీయ పార్టీ మీద ఓ ప్రాంతీయ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం చారిత్రాత్మకమని తెలుగుదేశం పార్టీ ఎంపీ సుజనా చౌదరి శుక్రవారం అన్నారు. నాలుగేళ్లు గడిచినా నవ్యాంధ్ర ప్రదేశ్కు అన్యాయం చేశారన్నారు. న్యాయం చేయాలనే ఆలోచన ఏ కోశాన లేదన్నారు.
విభజన అన్యాయంగా జరిగిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారని, కానీ అదే ప్రధాని న్యాయం చేయలేదన్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఏకమైనా గెలుపొందలేకపోయామన్నారు. ప్రతిపక్షాలు అన్నీ ఏకమైనా కొన్ని సాధించుకోలేకపోయినట్లు తెలిపారు.
డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో ఎన్డీయే వ్యతిరేకత ఓట్లు కొంత మెరుగ్గానే పడ్డాయన్నారు. రాఫెల్ కుంభకోణం గురించి కేంద్రం ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరు దారుణంగా ఉందన్నారు. కేంద్రంపై చట్టసభలో, ప్రజాక్షేత్రంలో పోరాటం తప్పదన్నారు.
జీవీఎల్పై బుద్దా నిప్పులు
బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహా రావు అవినీతి చక్రవర్తి అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. ఆయన వందల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో సాక్ష్యాధారాలతో సహా వెల్లడిస్తామన్నారు. అక్రమ సంపాదనపై జీవీఎల్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
బీజేపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా రాష్ట్రానికి నమ్మకద్రోహం చేశాయన్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక విషయంలో మరోసారి వారి లోపాయికారి ఒప్పందం బయటపడిందన్నారు.