ఏపీ సీఎంగా అంజాద్బాషా -డీజీపీ సవాంగ్ తొలగింపు -టీడీపీ సంచలన డిమాండ్లు -నిమ్మగడ్డకు మొర
ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ కు, జగన్ సర్కారుకు మధ్య కొనసాగుతోన్న వివాదంలో హైకోర్టు సంచలనం తీర్పు ఇచ్చింది. పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును.. డివిజన్ బెంచ్ బుధవారం కొట్టేసింది. ప్రజారోగ్యంతోపాటు ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల నిర్వహణ కూడా అవసరమేనన్న డివిజన్ బెంచ్.. ఎన్నికల ప్రక్రియను కొనసాగించొచ్చని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆయన అధికారులతో వరుస సమావేశాలు మొదలుపెట్టారు. మరోవైపు ఇప్పటికీ ఎన్నికలకు నో చెబుతోన్న ప్రభుత్వం.. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీ సంచలన డిమాండ్ ను తెరపైకి తెచ్చింది.
Recommended Video
జగన్ క్రేజ్ బాగా తగ్గింది -చంద్రబాబు ఇంకా కిందికి -వైసీపీ, టీడీపీల విరాళాల్లో తగ్గుదల: ఈసీ రిపోర్ట్
సీఎం జగన్ రాజీనామా..
స్థానిక ఎన్నికలపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, పార్టీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. వర్ల ఏమన్నారో ఆయన మాటల్లోనే.... ''ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణపై హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును టీడీపీ స్వాగతిస్తున్నది. తీర్పు వచ్చిన దగ్గర్నుంచి సీఎం జగన్ కు వణుకు మొదలైంది. రేషన్ సరుకుల పంపిణీ బండ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖంలో కళ కనిపించలేదు. స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం భయపడుతోంది. నిజానికి ఇది సీఎం జగన్ రాజీనామా చేయాల్సిన సందర్భం. మొన్న సింగిల్ జడ్జి తీర్పు వచ్చిన రోజున ప్రభుత్వ పెద్దలంతా.. ఎస్ఈసీ నిమ్మగడ్డను రాజీనామా చేయాలని డిమాండ్ చేశారే.. ఆ లెక్క ప్రకారం డివిజన్ బెంచ్ తీర్పు తర్వాత సీఎం జగన్ పదవి నుంచి దిగిపోవాలికదా. వైసీపీ సర్కారు నిర్ణయాలు, ఆలోచనలు తప్పని కోర్టు స్పష్టంగా చెప్పంది. మీ పార్టీకి ఏమాత్రం నైతిక విలువలున్నా వెంటనే రాజీనామా చేయాలి.
అంజాద్ బాషాకు సీఎం పోస్టు..
స్థానిక ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో జగన్ వెంటనే రాజీనామా చేసి.. ఆ పదవిలో డిప్యూటీ ముఖ్యమంత్రి అంజాద్ బాషాను కూర్చోబెట్టాలి. ఎందుకంటే అంజాద్ బాషా.. కోర్టు తీర్పును స్వాగతించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీ సిద్ధంగా ఉంటుందని బాషా ధైర్యంగా చెప్పారు. అదే జగన్ మాత్రం.. ఎక్కేగడప దిగే గడప అన్నట్లుగా.. గవర్నర్ దగ్గరికి, అడ్వకేట్ల దగ్గరికి పరుగులు తీస్తున్నారు. జగన్ తో పోల్చుకుంటే అంజాద్ బాషానే సమర్థుడిలా కనిపిస్తూ, ధైర్యంగా మాట్లాడుతున్నారు. సీఎం వెనుకడుగు వేస్తోంటే.. డిప్యూటీ మాత్రం స్ఫూర్తిని కనబరుస్తున్నారు. కాబట్టి కనీసం ఎన్నికలు అయ్యేంత వరకైనా బాషాను సీఎంగా ఉండనివ్వాలి. స్వాగతించారు. గతంలో ఎంతో మంది సీఎంలు నైతికతకు కట్టుబడి, కోర్టు తీర్పుల నేపథ్యంలో రాజీనామాలు చేశారు.
డీజీపీగా సవాంగ్ వద్దేవద్దు..
ఎన్నికల నిర్వహణ కోసం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు మార్గం సుగమమం అయింది కనుక ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. అందులో మొదటిది.. రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆ పోస్టులో ఉండటానికి వీల్లేదు. సవాంగ్ ఉంటే పంచాయతీ ఎన్నికలు సజావుగా జరగవు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు సవాంగ్ ను తొలగించాలి. సమర్థుడు, నిష్పక్షపాతంగా వ్యవహరించే వ్యక్తిని డీజీపీగా నియమించాలని నిమ్మగడ్డను డిమాండ్ చేస్తున్నాం.
విహార యాత్రకు పంపండి..
డీజీపీ గౌతమ్ సవాంగ్ ఇటీవల కాంట్రవర్షియల్ వ్యక్తగా మారాడు. అడుగడుగునా అధికార పార్టీకి వత్తాసుపలుకుతున్నారు. ఈ ఎన్నికలు జరిగేంత వరకు ఆయనను పోస్టులో నుంచి తొలగించడమేకాదు.. అసలీ రాష్ట్రంలోనే లేకుండా చేయాలి. విహారయాత్రలకు పంపుతారా, వేరే రాష్ట్రంలో డ్యూటీకి పంపుతారా అనేది ఎస్ఈసీ ఇష్టం. ఈ మేరకు నిబంధనలు కూడా ఉన్నాయి. గతంలో ఎన్నికల నేపథ్యంలో చీఫ్ సెక్రటరీ పునేఠాను తొలగించిన ఘటన ఏపీలోనే చోటుచేసుకుంది. డీజీపీ సవాంగ్ బాహాటంగా టీడీపీ పట్ల వ్యతిరేక ధోరణి ప్రదర్శిస్తున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తనకు డీజీపీ పదవి ఇవ్వలేదనే అక్కసుతో టీడీపీ పట్ల సవాంగ్ మరోలా వ్యవహరిస్తున్నారు''అని వర్ల రామయ్య అన్నారు.
మజ్లిస్ పార్టీకి విరాళాల వెల్లువ -ఓవైసీకి దేశమంతటా క్రేజ్ -టీఆర్ఎస్ డేటా రాలేదు -ఈసీ రిపోర్ట్
ఫోటోలు: ఇంటి వద్దకే రేషన్ చేర్చే మొబైల్ వాహనాలను ప్రారంభించిన ఏపీ సీఎం జగన్