ఎన్నికల బహిష్కరణ సరే.. పార్టీ ఓట్లు ఏమయ్యాయ్: దిక్కుతోచని స్థితిలో టీడీపీ
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి జనాదరణ ఏ మాత్రం తగ్గలేదనే విషయం మరోసారి నిరూపితమైంది. ఇదివరకు పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లను క్లీన్స్వీప్ చేసిన విధంగానే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లోనూ వైఎస్సార్సీపీ తిరుగులేని విజయాలను సొంతం చేసుకుంటోంది. అన్ని జిల్లాల్లోనూ వైసీపీ ప్రభంజనం కనిపిస్తోంది.
భారత విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్: 5 నెలల తరువాత నిషేధం ఎత్తేసిన ఆ దేశం
రెండున్నరేళ్ల తరువాతా..
అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ల తరువాత కూడా ప్రభుత్వ వ్యతిరేక పవనాలు ఏ మాత్రం వీయట్లేదనే విషయాన్ని ఈ ఫలితాలు స్పష్టం చేస్తోన్నాయి. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లవుతోంది. అయినప్పటికీ వైసీపీ సత్తా ఏ మాత్రం తగ్గలేదని ఈ ఎన్నికలు రుజువు చేశాయి. అలాగే- తెలుగుదేశం పార్టీ ఏ మాత్రం పుంజుకోలేకపోయిందనే విషయం కూడా ఇక్కడ నిరూపితమైంది. గ్రామస్థాయిలో ఓటుబ్యాంకు ఏ మాత్రం బలంగా లేదని స్పష్టమైంది.
పార్టీ పటిష్టతపై
సార్వత్రిక ఎన్నికలకు ఇంకా కావాల్సినంత సమయం ఉంది. ఈ లోగా పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలపేతం చేయడంపైనా టీడీపీ పెద్దగా దృష్టి సారించనట్టే కనిపిస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంపై తప్ప మరెందులోనూ ఆశించిన స్థాయిలో స్పందించట్లేదు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను తాము బహిష్కరించామని, అందువల్లే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా విజయం సాధించిందని టీడీపీ నాయకులు చెబుతున్నారు.
బహిష్కరించడం వల్లే..
పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మొదలుకుని జిల్లా స్థాయి నాయకుల వరకు ఇదే రకమైన స్పందన కనిపిస్తోంది. ఎన్నికలను బహిష్కరించడం వల్లే ప్రజలు అధికార పార్టీకి ఓటు వేశారని చెబుతున్నారు. నిజానికి- వైసీపీ వైపు జనం లేరని తమకు తాము చెప్పుకొంటోన్నారు. తాము పోటీ చేసి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవనీ సమర్థించుకుంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే కారణంతోనే ఎన్నికలను బహిష్కరించామని స్పష్టం చేస్తోన్నారు.
ఓట్లు ఏమయ్యాయ్
ఇక్కడిదాకా అంతా బాగానే ఉన్నప్పటికీ.. ఓట్ల శాతం వద్దే తేడా కొడుతోంది. తెలుగుదేశం ఎన్నికలను బహిష్కరిస్తే- ఆ పార్టీకి ఉన్న ఓట్లు ఏమయ్యాయ్ అనే ప్రశ్న తలెత్తుతోంది. టీడీపీకి మద్దతుదారులు, సానుభూతిపరులు, అభిమానులు, కార్యకర్తలు, దశాబ్దాల కాలం పాటు ఆ పార్టీకి అండగా ఉంటూ వస్తోన్న కుటుంబాలు.. తమ ఓటు హక్కును వినియోగించుకోకూడదు. అలాంటప్పుడు పోలింగ్ శాతం తగ్గి ఉండాలి. అలాగే- ఓ ఎంపీటీసీ లేదా జెడ్పీటీసీ స్థానం పరిధిలో ఉండే మొత్తం ఓట్లు, గెలిచిన వైసీపీ అభ్యర్థికి పడిన ఓట్ల మధ్య తేడా భారీగా ఉండాలి. క్షేత్రస్థాయిలో అలా జరగలేదు. ఎన్నికలను బహిష్కరించినా.. టీడీపీ ఓటుబ్యాంకు కూడా వైసీపీకే ఓటు వేసిందనేది ఇక్కడ స్పష్టమౌతోంది.
ఆ తేడా ఏదీ..
టీడీపీ నాయకులు అంచనాలు, అభిప్రాయాలు, వారు చెబుతోన్న మాటలకు, వాస్తవ పరిస్థితికి ఏ మాత్రం పొంతన ఉండట్లేదు. ఉదాహరణకు చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం నియోజకవర్గం పరిధిలోని టీ సదుముూరు మండలంలో ఉన్న మొత్తం 1243 ఓట్లు. అందులో వైఎస్సార్సీపీ అభ్యర్థినికి 1143 ఓట్లు పోల్ అయ్యాయి. అంటే 90 శాతానికి పైగా ఓట్లు పోల్ అయినట్టే. టీడీపీ ఈ ఎన్నికలను బహిష్కరించిన నేపథ్యంలో- ఆ పార్టీ అభిమానులు ఎవ్వరూ ఓట్లు వేయలేదని అనుకుంటే- ఈ తేడా భారీగా ఉండాలి. అలా జరగలేదు. 90 శాతం ఓట్లు వైసీపీకే పడటంతో టీడీపీ ఓట్లు ఏమయ్యాయ్ అనే ప్రశ్న ఉత్పన్నమౌతోంది.
రాష్ట్రవ్యాప్తంగా ఇంతే..
ఇదొక్క కుప్పం నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాని పరిస్థితి. రాష్ట్రవ్యాప్తంగా ఇవే ఫలితాల ప్రతిఫలించాయి. అధికార పార్టీకి 90 శాతానికి పైగా ఓట్లు పడ్డాయి. తెలుగుదేశం పార్టీ ఓటుబ్యాంకు ఏమైందనే అనుమానం రావడం అత్యంత సహజం. 2019 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి పడిన ఓట్ల శాతం 39.59. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తే.. ఈ ఓట్ల శాతం చెక్కు చెదరకూడదు. ఇంకా పెరగాలి. అలా జరగలేదు. 90 శాతానికి పైగా ఓట్లను వైసీపీ కొల్లగొట్టింది. అంటే- ఎన్నికలను బహిష్కరించినా సరే.. టీడీపీ ఓటుబ్యాంకు, ఆ పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.. అధికార పార్టీకి జై కొట్టినట్టేనని స్పష్టమౌతోంది.
దిక్కుతోచని స్థితికి టీడీపీ..
ఈ పరిణమాలు తెలుగుదేశం పార్టీని దిక్కుతోచని స్థితికి నెట్టేసినట్టయింది. పార్టీ అగ్ర నాయకత్వాన్ని అయోమయానికి గురి చేస్తోంది..గందరగోళంలో పడేసింది. దేశ రాజకీయాల్లో 40 సంవత్సరాల అనుభవం ఉన్నట్లుగా చెప్పుకొంటోన్న చంద్రబాబు సారథ్యాన్ని వహిస్తోన్న టీడీపీకి భవిష్యత్ అగమ్యగోచరంగా మారినట్టయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన రెండున్నరేళ్ల తరువాత కూడా ఆ పార్టీ గాడిలో పడలేదనేది జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు మరోసారి రుజువు చేశాయి. ఇదివరకు పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు అచ్చు గుద్దినట్టు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలు వెలువడ్డాయి.
Recommended Video
పునఃసమీక్ష ఉంటుందా?
ఈ పరిణామాల మధ్య పార్టీకి పూర్వవైభవాన్ని తీసుకుని రావడానికి చంద్రబాబు నాయుడు గానీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ గానీ ఎలాంటి వ్యూహాలను రచిస్తారనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల వరకు సమయం ఉంది. ఓ పార్టీని పునరుజ్జీవింప జేయడానికి సరిపోయే సమయం ఇది. ఈ లోగా పార్టీ పునఃసమీక్షించుకుంటుందా? లేక.. ఎప్పట్లాగే దిశానిర్దేశం లేకుండా, ఒక సామాజిక వర్గానికి చెందిన మీడియాను అడ్డుగా పెట్టుకుని వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఎదురుదాడి చేయడానికే ప్రాధాన్యత ఇస్తుందా? అనేది చర్చనీయాంశమౌతోంది.