ఓటుకు నోటులో ఏంలేదని కోర్టే చెప్పింది, ఏం చేస్తారో చూద్దాం, బాబుపై జగన్ కుట్ర: టీడీపీ షాకింగ్
అమరావతి: తాను జైలుకు వెళ్లాను కాబట్టి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కూడా జైలుకు పంపించాలనేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కోరిక అని టీడీపీ నేత, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంగళవారం విమర్శించారు. మా సీఎం చంద్రబాబుపై ఓటుకు నోటు కేసు లేదు, ఏ కేసూ లేదన్నారు.
అన్ని వివరాలతో చర్చిద్దాం!: కేసీఆర్, ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం, ఏం జరుగుతోంది?
సోమవారం తెలంగాణ సీఎం కేసీఆర్ ఓటుకు నోటు కేసు సహా పలు కేసులను సమీక్షించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు స్పందించారు. సోమిరెడ్డి మాట్లాడుతూ.. కేసుల కోసం జగన్.. మోడీకి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారన్నారు. 12 కేసుల్లో ఏ1గా ఉన్న జగన్ చంద్రబాబును విమర్శించడం దారుణమన్నారు. బీజేపీ నేతలు బరితెగించి ఇష్టమొచ్చిన భాష మాట్లాడుతున్నారన్నారు.
కేంద్రంతో కలిసి జగన్ కుట్ర, ఓటుకు నోటు కేసు కాదు
కేంద్ర ప్రభుత్వంతో కలిసి జగన్ తమ పార్టీపై కుట్రలు చేస్తున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. వైయస్ రాజశేఖర రెడ్డి నాడు చంద్రబాబుపై 62 కేసుల్లో విచారణ జరిపారని కానీ నిరూపించలేకపోయారన్నారు. చంద్రబాబు విషయంలో ఓటుకు నోటు ఓ కేసే కాదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే హైకోర్టు ఓ జడ్జిమెంట్ ఇచ్చిందని, ఏం చేస్తారో చూద్దామన్నారు. ఈ కేసులో జరిగేదేమీ లేదని, జరగబోయేదేమీ లేదన్నారు.హైకోర్టు పరిధిలో ఉన్న కేసును కేసీఆర్ ఎలా సమీక్షిస్తారని ప్రశ్నించారు.
కాంగ్రెస్తో కలిసే ప్రసక్తి లేదు
తాము కాంగ్రెస్ పార్టీతో కలుస్తున్నట్లుగా గత కొన్నాళ్లుగా ప్రచారం సాగుతోందని సోమిరెడ్డి అన్నారు. తాము ఆ పార్టీతో కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. చంద్రబాబును జైలుకు పంపడం జగన్ తండ్రి వల్లే కాలేదన్నారు. అయిదున్నరేళ్లలో రాష్ట్రాన్ని దోచుకొని, వ్యవస్థను భ్రష్టు పట్టించింది వాళ్లేనని వైయస్ను ఉద్దేశించి అన్నారు. కర్నాటక ఎన్నికల్లో రూ.కోట్లు పంచి బీజేపీ గెలవడానికి ప్రయత్నిస్తోందన్నారు. ఏపీ ప్రజల కోసం మోడీీని నిలదీసిన వారు హీరో అని చెప్పారు.
ఓటుకు నోటు కేసుపై ఎవరూ అధికారికంగా చెప్పలేదు
తెలంగాణలో జరుగుతున్న పరిణామాలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలుగుదేశం పార్టీపై, చంద్రబాబుపై బురద జల్లుతోందని టీడీపీ నేత కంభంపాటి హరిబాబు మంగళవారం మండిపడ్డారు. ఓటుకు నోటు కేసుపై సమీక్షిస్తున్నానని అధికారికంగా ఎవరూ చెప్పలేదని వెల్లడించారు.
ఓటుకు నోటు కేసులో ఏమీ లేదని హైకోర్టే చెప్పింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవాలని, సంక్షేమ పథకాలు ముందుకు నడువవద్దని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుందని కంభంపాటి ఆరోపించారు. కేంద్రం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. చంద్రబాబుపై గతంలో వేసిన అనేక కేసుల్లో ఒక్కటీ నిలువలేదన్నారు. ఓటుకు నోటు కేసులో ఏమీ లేదని స్వయంగా హైకోర్టు చెప్పిందని చెప్పారు.