కేంద్రం కోర్టులోకి జోగి రమేష్ ఘటన-హోంశాఖకు టీడీపీ ఫిర్యాదు-చంద్రబాబుకు మరింత భద్రత !
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న పోరుకు తాజాగా అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు, ఆ తర్వాత జోగి రమేష్ హంగామా కొత్త ట్విస్ట్ ఇచ్చాయి. సీఎం జగన్ పై అయ్యన్న వ్యాఖ్యల్ని నిరసిస్తూ చంద్రబాబు ఇంటిపైకి జనంతో వెళ్లిన జోగి రమేష్ ఇప్పుడు వైసీపీని ఇరికించేసినట్లే కనిపిస్తున్నారు. ఆ రోజు జరిగిన ఘటనల్లో వైసీపీ తప్పేం లేదని గుంటూరు పోలీసులు చెప్తున్న నేపథ్యంలో టీడీపీ కేంద్ర హోంశాఖను ఆశ్రయించింది. వైసీపీ దాడి నేపథ్యంలో చంద్రబాబుకు మరింత భద్రత కల్పించాలని కోరింది. దీంతో జోగి రమేష్ చేసిన హంగామా ఇప్పుడు వైసీపీకి తలనొప్పిగా మారిపోతోంది.
వైసీపీ వర్సెస్ టీడీపీ పోరు
ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య పోరాటం పదేళ్లుగా సాగుతూనే ఉంది. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత అప్పటికే ఘోర పరాజయంతో కుదేలైన టీడీపీని మరింత అణగదొక్కాలన్న ప్రయత్నం చేయడంతో పరిస్ధితులు ఎప్పటికప్పుడు వాడీవేడిగా మారిపోతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు సీఎం జగన్ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్ని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ సీరియస్ గా తీసుకున్నారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా చంద్రబాబు ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు ఇరు పార్టీల్ని కుదిపేస్తోంది.
నిప్పు రాజేసిన జోగి రమేష్
వాస్తవానికి సీఎం జగన్ ను ఉద్దేశించి టీడీపీ నేతలు, చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ నేతలు ఇప్పటికే వందలసార్లు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. అప్పటికప్పుడు వాటికి ప్రత్యర్ధి పార్టీలు కౌంటర్లు ఇచ్చుకోవడం, ఆ తర్వాత అంతా మామూలైపోవడం జరుగుతూనే ఉంది. కానీ తాజాగా అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యల్ని పట్టుకుని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ చంద్రబాబు ఇంటిపైకి దాడికి వెళ్లడం ఇప్పుడు వివాదాన్ని రాజేస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేగా తానేం చేసినా చెల్లుతుందనే ధోరణిలో జోగి రమేష్ చంద్రబాబు ఇంటిపైకి వెళ్లడం, ఆ తర్వాత పోలీసులు కూడా ఆయన తప్పిదాన్ని కప్పిపుచ్చి.. ఆయన్ను అడ్డుకున్న టీడీపీ నేతలపై అట్రాసిటీ కేసులు పెట్టడం, వైసీపీ తప్పేం లేదంటూ గుంటూరు పోలీసులు చేస్తున్న ప్రకటనలు ఈ వివాదాన్ని మరింత ముదిరేలా చేస్తున్నాయి.
కేంద్రాన్ని ఆశ్రయించిన టీడీపీ
జోగి రమేష్ చంద్రబాబు ఇంటి వద్దకు కర్రలు, జెండాలతో, మందీ మార్బలంతో రావడం వీడియో ఫుటేజ్ లో స్పష్టంగా కనిపిస్తున్నా గుంటూరు పోలీసులు తమ నేతలదే తప్పంటూ తేల్చేయడంతో టీడీపీ ఈ వ్యవహారంపై కేంద్రాన్ని ఆశ్రయించింది. చంద్రబాబు ఇంటి వద్ద అసలేం జరిగిందో డ్రోన్ కెమెరాలతో తీసిన వీడియోలను కేంద్ర హోంశాఖకు పంపింది. టీడీపీ రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ఇంటి వద్ద జోగి రమేష్ అండ్ కో చేసిన హంగామాపై పూర్తి ఆధారాలు సమర్పించారు. దీంతో ఇప్పుడు వైసీపీ ఇరుకునపడింది.
చంద్రబాబుకు మరింత భద్రత కోరిన టీడీపీ
టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యల్ని పట్టుకుని అధినేత చంద్రబాబు ఇంటిని టార్గెట్ చేస్తూ వైసీపీ ఎమ్మల్యే జోగి రమేష్ చేసిన హంగామాపై కేంద్రానికి ఫిర్యాదు చేసిన టీడీపీ ఎంపీ కనకమేడల.. అదే సమయంలో చంద్రబాబుకు మరింత భద్రత కల్పించాలని కోరారు. ఇప్పటికే జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న చంద్రబాబు ఇంటికే వైసీపీ ఎమ్మెల్యే మందీ మార్బలంతో రావడం, పోలీసులు ఆయన్ను అడ్డుకోకపోవడంపై ఫిర్యాదులో పేర్కొన్న కనకమేడల.... చంద్రబాబుకు మరింత భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అలాగే చంద్రబాబు ఇంటి వద్ద ఆ రోజు చోటు చేసుకున్న పరిణామాలపై పూర్తిస్దాయిలో దర్యాప్తు చేయించాలని కూడా హోంశాఖను టీడీపీ ఎంపీ కోరారు.త్వరలో ఇదే ఘటనపై ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాను కలుస్తామని టీడీపీ ఎంపీ కనకమేడల ప్రకటించారు.
కేంద్రం కోర్టులోకి బంతి
చంద్రబాబు ఇంటిపై కర్రలతో దాడికి వచ్చినా... అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి జోగి రమేష్ ను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్న టీడీపీ.. కేంద్రానికి ఈ మేరకు సీరియస్ గా నే ఫిర్యాదు చేసింది. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు కేంద్రం కోర్టులోకి వెళ్లినట్లయింది. జోగి రమేష్ చంద్రబాబు ఇంటి వద్దకు వస్తారని తెలిసినా పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారన్న దానిపై కేంద్ర హోంశాఖ ఇప్పుడు దృష్టిసారిస్తోంది. జోగి రమేష్ ను జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కలిగిన విపక్ష నేత చంద్రబాబు ఇంటి వద్దకు ఎలా అనుమతించారన్న దానిపై గుంటూరు పోలీసులు ఇరుకునపడబోతున్నారు. ఇప్పటికే అక్కడ ఘటనతో టీడీపీ నేతలే దాడి చేశారని, జోగి రమేష్ రాకపై తమకు సమాచారం లేదని రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ చెప్పిన నేపథ్యంలో హోంశాఖ తీసుకోబోయే చర్యలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంటోంది.
Recommended Video
జోగి రమేష్ వైసీపీని అడ్డంగా బుక్ చేశారా ?
టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు చేస్తే పార్టీ అధినేత, విపక్ష నేత, జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న చంద్రబాబు ఇంటిపై కార్యకర్తలు, కార్లు, కర్రలతో వెళ్లిన జోగి రమేష్... తాను ఇరుక్కోవడంతో పాటు వైసీపీని కూడా ఇరికించినట్లు తెలుస్తోంది. దీంతో అసలు జోగి రమేష్ ను వైసీపీయే పంపిందా లేక ఆయనే స్వయంగా నిర్ణయం తీసుకుని వెళ్లారా అన్న చర్చ కూడా సాగుతోంది. తానే సవాళ్లు విసిరి వెళ్లిన జోగి రమేష్.. చివరికి వైసీపీని అడ్డంగా బుక్ చేశారన్న వాదన వినిపిస్తోంది. అదే నిజమైతే కేంద్రం స్పందించి చర్యలు తీసుకుంటే జోగితో పాటు వైసీపీ కూడా ఇరుకునపడే అవకాశముంది. మరి కేంద్రం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందా, చంద్రబాబుకు అదనపు భద్రత కల్పిస్తుందా, గుంటూరు పోలీసులపై చర్యలుంటాయా ? అనేది తేలాలంటే మరికొన్నిరోజులు ఆగాల్సిందే.