రూపాయి ఇవ్వలేదు: కేంద్రంపై యనమల, రాజకీయ వ్యభిచారం మానెయ్: విజయసాయికి టీడీపీ
Recommended Video
అమరావతి: ఏపీకి కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత ఒక్కరూపాయి ఇవ్వలేదని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం అన్నారు. ఏపీకి అన్యాయం చేయాలని కేంద్రం నిర్ణయించుకుందని ఆరోపించారు. కొన్ని రాష్ట్రాలకు హోదా తప్ప అన్నీ ఇచ్చారని చెప్పారు.
ఇతర రాష్ట్రాలకు ఇచ్చినట్లు ఏపీకి పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలన్నారు. రాయితీలు ఎవరికీ ఇవ్వడం లేదని చెప్పి ఇప్పుడు ఎలా ఇచ్చారని కేంద్రాన్ని ప్రశ్నించారు. నచ్చిన చోట పంచుకోవడమేనా కేంద్రం విధానం అని మండిపడ్డారు.
పేరుకే రాష్ట్రాలకు 42 శాతం వాటా
పేరుకు రాష్ట్రాలకు 42 శాతం వాటా అంటున్నారని, కానీ గతం కంటే తక్కువ నిధులు వస్తున్నాయని చెప్పారు. 2017లో తీసుకున్న నిర్ణయాన్ని మనకూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం తీరు సరికాదని ఆక్షేపించారు.
విజయసాయి రెడ్డి సంస్కారహీనుడు
విజయ సాయి రెడ్డి సంస్కారహీనుడు అని, ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉండటం దురదృష్టకరమని వర్ల రామయ్య అన్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు ఆయనను విజయ్ మాల్యాతో పోల్చడంలో తప్పు లేదన్నారు. చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విజయసాయి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రాజకీయ వ్యభిచారం రాజకీయ వ్యభిచారం మానివేయాలి
విజయసాయి రెడ్డి రాజకీయ వ్యభిచారం మానివేసి ప్రజల కోసం పని చేయాలని మంత్రి జవహర్ మరోసారి మండిపడ్డారు. వ్యక్తిగత దూషణలకు వెళ్తే నీ చరిత్ర, నా నాయకుడు వైయస్ జగన్ చరిత్ర బయటపెడతామని హెచ్చరించారు. విజయసాయి జాగ్రత్తగా మాట్లాడాలన్నారు.
మోడీ అవిశ్వాసానికి భయపడుతున్నారు
మంత్రి నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ప్రభుత్వం అవిశ్వాసానికి భయపడి పారిపోతోందన్నారు. మోడీది మేకపోతు గాంభీర్యం అన్నారు. విజయసాయి రెడ్డి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారన్నారు. కేసుల కోసమే మోడీ కాళ్లు పట్టుకున్నారన్నారు.
ప్రస్టేషన్లో మాట్లాడారు
జేసీ దివాకర్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడుతూ.. విజయసాయి రెడ్డి ప్రస్టేషన్లో నోటికి వచ్చినట్లు మాట్లాడారని ధ్వజమెత్తారు. ప్రధాని ఎదుట విజయసాయి రెడ్డి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారన్నారు. ఇది క్షమించరాని నేరం అన్నారు. విజయసాయచి మాట్లాడిన భాష గ్రామాల్లో ప్రజలు కూడా మాట్లాడరన్నారు. ఆ వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. వైసీపీ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని, వారే తగిన విధంగా వైసీపీకి బుద్ధి చెబుతారన్నారు.