ఎంత పని చేసావు కేశవా.. పదవి ఎగరేసుకుపోతివి.! ప్రతీకారాన్ని రగిల్చితివి..!!
Recommended Video
అమరావతి/హైదరాబాద్ : ఏమీ లేని పార్టీలోనే అన్నీ కావాలనుకుంటారు. ఏపీలో అంతంత మాత్రంగా ఉన్న తెలుగుదేశం పార్టీలో పదవులు తీవ్ర చిచ్చు పెడుతున్నాయి. ఉన్న నలుగురు నేతల మద్య వివాదాన్ని రగిలిస్తోంది ఓ పదవి. సహజంగా ప్రతిపక్ష పార్టీ సభ్యులను వరించే పబ్లిక్ అకౌంట్స్ పదవి తెలుగుతమ్ముళ్లల్లో మనస్పర్థలను రగిలించింది. ఆ పదవిపై ఆశలు పెట్టుకున్న సీనియర్ నేతలకు కాస్త అసంతృప్తి ఎదురైంది.
పబ్లిక్ అకౌంట్స్ ఛైర్మన్ పదవి ఆశించి భంగపడ్డ నేతలు పయ్యావుల కేశవ్ పైన, పార్టీ అధినేత పైన కాస్త ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్గా అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్కు అవకాశం ఇవ్వాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్ణయించడంపై సీనియర్లు అసంతృప్తిగా ఉన్నట్టు వెల్లడవుతోంది.
టీడిపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయంపై అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. శాసనసభలో తమను వాడుకుని కీలక పదవిని మాత్రం కేశవ్కు కట్టబెట్టడంపై వీరంతా సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.చంద్రబాబు నిర్ణయంతో వెంటనే కేశవ్ బుధవారం అసెంబ్లీలో నామినేషన్ దాఖలు చేశారు. పీఏసీ చైర్మన్ పదవిని ప్రతిపక్షానికి కేటాయించడం సంప్రదాయంగా వస్తోంది.
ప్రతిపక్ష టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు కేశవ్, గంటా శ్రీనివాసరావు, అనగాని సత్యప్రసాద్, గద్దె రామ్మోహన్, గణబాబు తదితరులు ఈ పదవి ఆశించినా చంద్రబాబు కేశవ్వైపే మొగ్గు చూపారు. కేశవ్తో పాటు గంటా శ్రీనివాసరావు పేరును పరిశీలించారు. కానీ గంటా పార్టీ మారతారనే ప్రచారం నేపథ్యంలో కేశవ్ను ఎంపిక చేసినట్టు చెబుతున్నారు. కేశవ్ చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కావడంతో బీసీ లేదా కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం ఉంటుందని తొలుత ప్రచారం సాగింది. కానీ చివరకు చంద్రబాబు కేశవ్ పేరునే ఈ పదవికి ఖరారు చేయడం పార్ఠీలో అసంతృప్తులకు దారితీసింది.