జగన్, సుచరిత టార్గెట్గా దళిత కార్డు: టీడీపీ లెటర్పై పాత తేదీ: ఏపీలో హీటెక్కిన పాలిటిక్స్
అమరావతి: రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తెలుగుదేశం పార్టీ ఈ సారి దళిత కార్డుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై దాడికి దిగింది. దళితులను దారుణంగా అవమానించేలా జగన్ సర్కార్ వ్యవహరిస్తోందంటూ విమర్శలను గుప్పిస్తోంది. ఉన్నత పదవుల్లో కొనసాగుతూ, గౌరవంగా జీవిస్తోన్న దళితులను రోడ్డున పడేలా చేస్తోందంటూ నిప్పులు చెరుగుతోంది.
దళితుల సంక్షేమం కోసం పని చేస్తున్నామని మాటలు చెబుతూ..వారిని అవమానిస్తోందని ఆరోపణలను సంధిస్తోంది. డాక్టర్ సుధాకర్ సస్పెన్షన్ అనంతరం చోటు చేసుకున్న పరిణామాలన్నీ దళిత వైఖరికి అద్దం పడుతున్నాయని టీడీపీ మండిపడుతోంది.
సస్పెండైన డాక్టర్ సుధాకర్కు ఏమైంది?: చొక్కా లేకుండా గుండుతో రోడ్డుపై ఇలా..
డాక్టర్ సుధాకర్ అర్ధనగ్న ప్రదర్శనపై టీడీపీ గరం
విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎనస్తీషియనిస్ట్ డాక్టర్ సుధాకర్ను సస్పెండ్ చేయడాన్ని ప్రభుత్వ వైఖరికి నిదర్శనంగా చూపిస్తోంది తెలుగుదేశం పార్టీ. తాజాగా ఆయన నడిరోడ్డు మీద అర్ధనగ్నం ప్రదర్శన చేయడానికి పోలీసులు, జగన్ ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తోంది. దీనిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్, తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు సహా పలువురు నాయకులు స్పందించారు. వైఎస్ జగన్ను టార్గెట్గా చేసుకున్నారు.
జగన్ క్రూర మనస్తత్వానికి నిదర్శనం..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్రూర మనస్తత్వానికి డాక్టర్ సుధాకర్ ఉదంతం ఓ నిదర్శనమని నారా లోకేష్ విమర్శించారు. మాస్క్ ఇవ్వమని వేడుకున్న డాక్టర్ సుధాకర్ పట్ల ప్రభుత్వం నియంతలా వ్యవహరించిందని, ఆయనను సస్పెండ్ చేయడమే కాకుండా.. రోడ్డుకు ఈడ్చారని అన్నారు. ఒక దళిత డాక్టర్ను తాళ్లతో కట్టి, లాఠీలతో కొట్టించడం జగన్ ప్రభుత్వ ఉన్మాద చర్యలకు పరాకాష్ట అని అన్నారు. జగన్ దళితులను దారుణంగా అవమానిస్తున్నారని మండిపడ్డారు. నిజాలు బయటపెట్టిన సుధాకర్పై కక్ష కట్టిందని, దీనికి తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని నారా లోకేష్ హెచ్చరించారు.
దళితులను అణిచి వేస్తోన్న ప్రభుత్వం
దళిత డాక్టర్ సుధాకర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు విశాఖ వీధుల్లో పోలీసులు ఆయనను నగ్నంగా ఊరేగించారని తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు ఆరోపించారు. దళితులు ఇప్పటికైనా కళ్లు తెరవాలని ఆయన సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మాస్కులు లేవని ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే డాక్టర్ సుధాకర్ చేసిన పాపమా అని ప్రశ్నించారు. ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా దళిత వ్యతిరేకి జగన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని, దళిత జాతి రత్నాలను కాపాడుకుందామని ఎంఎస్ రాజు సూచించారు. దీనిపై ఉద్యమాన్ని కొనసాగించాలని అన్నారు.
దళిత బిడ్డను ఎలా అరెస్టు చేస్తారంటూ..
రాష్ట్ర హోం మంత్రి సుచరిత దళితురాలేనని, ఆమె కనుసన్నల్లోనే పోలీసులు దళితుడైన డాక్టర్ సుధాకర్ను అరెస్టు చేశారని వంగలపూడి అనిత ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, హోం మంత్రి సుచరిత ఆదేశాలతోనే పోలీసులు డాక్టర్ సుధాకర్ను వేధించి, పిచ్చివాడిని చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టం అందరికీ సమానమే అంటూ సుచరిత సుద్దులు చెబుతుంటారని, దళితులకు ఈ దుస్థితి ఎందుకు వచ్చిందో చెప్పాలని నిలదీశారు.
Recommended Video
పత్రికా ప్రకటనపై పాత తేదీ
డాక్టర్ సుధాకర్ను పోలీసులు తాళ్లతో కట్టేయడాన్ని తప్పు పడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జారీ చేసిన పత్రికా ప్రకటనపై పాత తేదీ ఉండటం చర్చనీయాంశమైంది. 16వ తేదీ మధ్యాహ్నం డాక్టర్ సుధాకర్ ఉదంతం చోటు చేసుకోగా.. అంతకుముందు రోజు నాటి తేదీని పొందుపరచడం పట్ల అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలు అనుమానాలను వ్యక్తం చేస్తోంది. సంఘటన చోటు చేసుకోవడానికి ముందే పత్రిక ప్రకటనను రెడీ చేసి పెట్టుకున్నారని, ఇదంతా చంద్రబాబు నడిపిస్తోన్న నాటకమని విమర్శిస్తున్నారు.