మాజీ మంత్రి పీ నారాయణ దారెటు? వైసీపీ వైపా..బీజేపీలోకా: మేకపాటి మంత్రాంగం ఏం చెబుతోంది?
నెల్లూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మున్సిపల్ శాఖ మాజీమంత్రి పొంగూరు నారాయణ ప్రస్తుతం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిపోయారు. తెలుగుదేశం పార్టీని వీడటానికి ఆయన రెడీ అయ్యారు. త్వరలోనే గుడ్బై చెప్పబోతుండటం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి సంకేతంగా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గానికి కొత్త నాయకుడిని ఇన్ఛార్జిగా కూడా నియమించారు. ఈ పరిస్థితుల్లో నారాయణ అడుగులు ఎటు వైపు అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
వైసీపీతో టచ్లో మాజీమంత్రి నారాయణ?: దర్యాప్తు ఎఫెక్ట్? నెల్లూరు సిటీ సీటుకు టీడీపీ కొత్త ఇన్ఛార్జి
వైసీపీ వైపు..ఈ వారంలోనే
సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా పార్టీని ఫిరాయించాల్సి వస్తే.. మొదటి ప్రాధాన్యతగా అధికార పక్షం వైపు చూపులు సారిస్తారు. అది సహజం. ప్రస్తుతం నారాయణ కూడా అదే పని చేస్తున్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆయన విశ్వప్రయత్నాలు చేస్తున్నారని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారని చెబుతున్నారు. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే- వచ్చే నాలుగైదు రోజుల్లో నారాయణ వైసీపీ తీర్థాన్ని పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
అమరావతి భూ సమీకరణపై సమగ్ర అవగాహన..అవినీతి ఆరోపణలు..
అయిదేళ్ల చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నారాయణ మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు. రాజధాని అమరావతి నిర్మాణం, దానికి అవసరమైన భూముల సమీకరణపై సమగ్ర అవగాహన ఆయనకు ఉంది. అత్యంత కీలకమైన రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి (సీఆర్డీఏ)ని ఏర్పాటు చేయడంలో నారాయణది కీలక పాత్ర. సీఆర్డీఏ చట్టాన్ని రూపొందించడంలో, దాన్ని అమలు చేయడంలో నారాయణ కీలకంగా వ్యవహించారు. అదే సమయంలో భారీగా అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలను ఎదుర్కొన్నారు.
మేకపాటి మంత్రాంగం
నారాయణను వైసీపీలోకి తీసుకుని రావడానికి మేకపాటి కుటుంబం ప్రయత్నిస్తోందనే విషయం ప్రధానంగా వినిపిస్తోంది. ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. నారాయణను పార్టీలోకి చేర్చుకోవడంపై ఆయనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఒత్తిడిని తీసుకొస్తున్నారని చెబుతున్నారు. సీఆర్డీఏ చట్టంపై పూర్తి అవగాహన ఉండటం వల్ల న్యాయపరమైన ఇబ్బందుల నుంచి అధిగమించడానికి ఆయన సేవలు ఉపయోగించుకోవచ్చనేది మేకపాటి అభిప్రాయంగా చెబుతున్నారు.
వైఎస్ కుటుంబానికి అత్యంత విశ్వసనీయంగా..
వైఎస్ కుటుంబానికి అత్యంత విశ్వసనీయంగా ఉంటోన్న కుటుంబం మేకపాటిది. నేదురుమల్లి కుటుంబం తరువాత ఆ స్థాయిలో నెల్లూరు జిల్లా రాజకీయాలపై పూర్తి పట్టు సాధించింది మేకపాటి కుటుంబం. వైసీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకొన్నప్పటికీ..ఆయన వారసులు కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ మంత్రిగా మేకపాటి గౌతమ్ రెడ్డి, ఎమ్మెల్యేగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు.
రాజమోహన్ రెడ్డి మాటను కాదన లేక..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచీ సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారు వారంతా. ఈ పరిస్థితుల్లో రాజమోహన్ రెడ్డి మాటను జగన్ కాదన లేకపోవచ్చని అంటున్నారు. అంతా సవ్యంగా సాగితే.. గురువారం లేదా శనివారం పొంగూరు నారాయణ వైసీపీ కండువాను కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అవినీతి ఆరోపణలను పక్కన పెడితే.. అమరావతి భూసమీకరణ విషయంలో, సీఆర్డీఏపై మంచి పట్టు ఉందని, దాన్ని ప్రభుత్వపరంగా వినియోగించుకోవచ్చనేది మేకపాటి వర్గీయుల అభిప్రాయంగా కనిపిస్తోందని అంటున్నారు.
నారాయణపై వైసీపీలో తీవ్ర వ్యతిరేకత..
నారాయణ వైసీపీలో చేరబోతున్నారనే టాక్ పట్ల వైసీపీలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. చాలామంది ఆయన రాకను వ్యతిరేకిస్తున్నారనడంలో సందేహాలు అనవసరం. అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటోన్న నారాయణ సేవలు పార్టీకి అవసరం లేదని బాహటంగా స్పష్టం చేస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియాలో ఇప్పటికే నారాయణ చేరికపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమౌతోంది. అరెస్టు భయంతోనే ఆయన పార్టీలో చేరడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు. అలాంటి వారిని చేర్చుకోవద్దనీ అభిప్రాయపడుతున్నారు.
Recommended Video
వైసీపీ కాదంటే బీజేపీ..
వైసీపీలో చేరే పరిస్థితి లేకపోతే.. నారాయణ ప్రత్యామ్నాయం చూసుకున్నారని తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీలో చేరవచ్చనీ అంటున్నారు. ఇప్పటికే బీజేపీలో చేరిన టీడీపీ నేతలు కొందరు ఈ దిశగా సంకేతాలు ఇస్తున్నారని చెబుతున్నారు. టీడీపీలో కొనసాగినప్పుడు ఐటీ దాడులను ఎదుర్కొన్న రాజ్యసభ సభ్యులు సుజానా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ కాషాయ కండువా కప్పుకొన్నారు. అదే తరహాలో వైసీపీ ప్రభుత్వం నుంచి ఇబ్బందులను తప్పించుకోవడానికి ఆయన బీజేపీలో చేరే అవకాశాలు కూడా లేకపోలేదనేది నెల్లూరు జిల్లా టాక్.